NTV Telugu Site icon

Viral News: ట్యాక్సీడ్రైవర్ నుంచి మెసేజ్ రాగానే.. లండన్‌లో పిల్లలను వదిలేసి హైదరాబాద్‌కు..

Woman Came To Hyd From Lond

Woman Came To Hyd From Lond

Viral News: ఓ ట్యాక్సీ డ్రైవర్‌ నుంచి వెళ్లిన మెసేజ్.. తనకు వివాహమై భర్త పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయేలా చేసింది. ఏకంగా లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా రప్పించింది. భార్య కనిపించకపోవడంతో భర్తకు అనుమానం మొదలై విచారించగా.. ట్విస్ట్‌లు బయటపడ్డాయి. అసలేం జరిగిందంటే.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం 13 ఏళ్ల కొడుకు, 12 ఏళ్ల కూతురు ఉన్నారు. భర్త ఉద్యోగ రీత్యా కొన్ని నెలల కిందటే.. భార్యా, పిల్లలతో లండన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇలా సవ్యంగా సాగుతున్న వీరి సంసారంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఫిబ్రవరిలో ఆమె తల్లి చనిపోవడంతో పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చింది. తన తల్లి అస్తికల నిమజ్జనం కోసం ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని తిరిగాక.. ట్యాక్సీ డ్రైవర్‌తో ఆన్‌లైన్‌లో పేమెంట్‌ను చెల్లించింది. ట్యాక్సీ డ్రైవర్‌ ఆమె సెల్‌ ఫోన్‌ నంబర్‌ను సేవ్ చేసుకుని చాటింగ్ మొదలు పెట్టాడు. అతడి మాయమాటలకు ఆమె ఆకర్షితురాలైంది. అతడు రోజూ పంపే మెసేజ్‌లు చూసి ఆమె అతడి మాయలో పడిపోయింది. ఇలా ఇద్దరి మధ్య చాటింగ్ రోజురోజుకు పెరిగిపోయింది.

Read Also: TG DSC 2024: గుడ్‌ న్యూస్.. నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు

సెప్టెంబర్‌ 16న ఆమె భర్త తల్లి మృతి చెందడంతో ఒంటరిగా హైదరాబాద్‌కు వచ్చాడు. భర్త లేకపోవడంతో సెప్టెంబర్‌ 30న తన పిల్లలను పార్క్‌లో వదిలేసి, ఆమె కూడా ఇండియాకు వచ్చేసింది. తల్లి కనిపించలేదంటూ పిల్లలు.. తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో అతను హుటాహుటిన లండన్ వెళ్లా్ల్సి వచ్చింది. చివరకు ఆరాతీయగా.. భార్య ముంబై వెళ్లి, అటు నుంచి అటే శంషాబాద్ మధునగర్ కాలనీకి వెళ్లినట్లు తెలిసింది. భార్యకు ఫోన్‌ చేయగా.. ఓ సారి ఎయిర్‌పోర్టుకు బయలుదేరానని, మరోసారి ఓ ట్యాక్సీ డ్రైవర్‌ కిడ్నాప్ చేస శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంచాడని నమ్మించింది. ఆందోళనకు గురైన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్ టవర్‌ లొకేషన్ ఆధారంగా ఆమె గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం ఆమెను విమానం ఎక్కించి లండన్‌కు పంపించారు. ట్యాక్సీ డ్రైవర్‌పై వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. ముత్యాల్లాంటి ఇద్దరు, పిల్లలు.. విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఆమె మాయమాటలకు ఆకర్షితురాలైందని తెలిసింది. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.