Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!

Vinukonda

Vinukonda

Vinukonda: మహిళపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ.. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న వినుకొండ మాజీ సీఐ చినమల్లయ్య శనివారం తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఏప్రిల్ 29న బ్రాహ్మణపల్లికి చెందిన ఓ మహిళ.. సీఐ చినమల్లయ్య తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు.

ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ:

అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే చినమల్లయ్య అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఆరోపణల తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానాలు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసాయి. మరోవైపు పోలీసులు చినమల్లయ్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ లాభం లేకపోయింది.

×
×
Ad

సర్వీస్ నుండి డిస్మిస్:

చినమల్లయ్యపై వచ్చిన ఆరోపణలు, ఆయన పరారీలో ఉండడాన్ని గమనించిన పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకున్నారు. చినమల్లయ్యను పోలీస్ సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ (ఉద్యోగం నుండి తొలగిస్తూ) ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితమే చినమల్లయ్య వినుకొండ కోర్టులో ఎవరికీ తెలియకుండా లొంగిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రస్తుతం జడ్జి వెకేషన్‌లో ఉండడంతో అక్కడ లొంగిపోవడం కుదరలేదు. దీంతో ఆయన అక్కడినుంచి వెనుతిరిగారు. చివరకు శనివారం తెల్లవారుజామున నేరుగా వినుకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన ప్రక్రియను మొదలు పెట్టనున్నారు.