YCP-Vijaysai Reddy: టీడీపీ నేతలతో రహస్య మంతనాలు.. విజయసాయిరెడ్డి వీడియో బయటపెట్టిన వైసీపీ!

  • విజయసాయిరెడ్డిపై వైసీపీ సంచలన ట్వీట్‌
  • టీడీపీ నేతలతో విజయసాయిరెడ్డి రహస్య మంతనాలు
  • విజయసాయిరెడ్డి వీడియో బయటపెట్టిన వైసీపీ
Vijaysai Reddy

Vijaysai Reddy

విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌న‌డానికి ప‌క్కా ఆధారాలు అంటూ ఎక్స్‌లో వైసీపీ పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది. టీడీపీ నేతలతో విజ‌య‌సాయిరెడ్డి రహస్య మంతనాలు చేశారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో విచారణకు ముందు మీటింగ్ జరిగిందని వైసీపీ తెలిపింది. తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నంబర్ 27కు విజయసాయిరెడ్డి వెళ్లారని, 13 నిమిషాల తర్వాత అక్కడికి టీడీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారని, ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు చర్చలు జరిగిందని ట్వీట్ చేసింది. మీటింగ్ తర్వాత ప్రెస్‌మీట్‌లో విజయసాయిరెడ్డి తమ పార్టీపై విషం కక్కారని వైసీపీ చెప్పుకొచ్చింది.

Also Read: JC Prabhakar Reddy: రాబోయే ఎలక్షన్‌లలో చాలా పోటీ ఉంటుంది.. ప్రజలే మాకు దేవుళ్లు!

‘మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశం. తాడేప‌ల్లి పార్క్ విల్లాలోని విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి. 13 నిమిషాల త‌ర్వాత అదే విల్లాకు నారా చంద్రబాబు నాయుడు న‌మ్మిన‌బంటు టీడీ జ‌నార్ధ‌న్‌. 45 నిమిషాల పాటు ర‌హ‌స్య మంత‌నాలు. విచార‌ణ ముగిసిన వెంట‌నే మీడియా ముందు వైయ‌స్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు, విష‌పు వ్యాఖ్య‌లు. విజ‌య‌సాయిరెడ్డిని న‌మ్మి, ద‌గ్గ‌ర పెట్టుకుని, పార్టీలో క్రియాశీల‌క ప‌ద‌వుల‌తో పాటు రాజ్య‌స‌భకు పంపించి గౌర‌వించిన జగన్. ఇంకా మూడేళ్లు ప‌ద‌వీ కాలం ఉన్నా సీఎం చంద్ర‌బాబుకు మేలు చేసేందుకు రాజీనామా చేసిన విజ‌య‌సాయిరెడ్డి. ఇది న‌మ్మ‌కం ద్రోహం కాదా?’ అని వైసీపీ పార్టీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు వీడియోను జత చేసింది. ప్రస్తుతం వైసీపీ వదిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.