Vijay Sethupathi: సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజం కానీ, ఒక హీరోగా అగ్రస్థాయిలో ఉంటూ, తాను నిర్మించిన సినిమాలన్నీ నష్టాలనే మిగిల్చాయని బాహాటంగా ఒప్పుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యానికి మరో పేరే విజయ్ సేతుపతి. కేవలం స్టార్డమ్ కోసం కాకుండా, వైవిధ్యమైన కథల కోసం పరితపించే ఆయన, తన ప్రొడక్షన్ హౌస్లో ఎదుర్కొన్న ఆర్థిక ఒడిదుడుకుల గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: Rajasekhar: గోటీల ఫ్యాక్టరీపై స్పందించిన హీరో రాజశేఖర్
నిజానికి నిర్మాతగా విజయ్ సేతుపతి ప్రయాణం ఆరంభంలోనే ఒడిదుడుకులకు లోనైంది. ఆయన మొదట ‘సంగుతేవన్’ అనే చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. కేవలం ఆ ఒక్క సినిమా డ్రాప్ అవ్వడం వల్లే ఆయనకు సుమారు 1.75 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఒక సినిమా ఆగిపోతేనే వెనకడుగు వేసే ఈ రోజుల్లో, సేతుపతి వరుసగా ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మాణంలో వచ్చిన ఆరెంజ్ మిఠాయి, మేర్కు తోడర్చి మలై, జుంగా, లాభమ్ చిత్రాలన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఆర్థికంగా ఇవన్నీ నష్టాలను తెచ్చిపెట్టాయని ఆయన స్వయంగా వెల్లడించారు. “నేను నిర్మించిన చిత్రాలన్నీ నాకు నష్టాలనే ఇచ్చాయి. కానీ వాటి గురించి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే ఆ కథలంటే నాకు ఇష్టం. మనసుకి నచ్చిన సినిమాలు చేశానన్న తృప్తి నాకుంది.” అని విజయ్ సేతుపతి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమాల వల్ల కలిగిన ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే, కథలపై ఉన్న మక్కువతో ఆయన డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘కాట్టాన్’ అనే వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. విశేషం ఏమిటంటే, ఈసారి తన స్వంత పెట్టుబడి కాకుండా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ సిరీస్ కోసం నిధులను సమకూర్చింది.
READ ALSO: Pakistan: పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఆఫ్ఘన్ మెరుపు దాడి!