Rashmika: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంట ఇటీవల రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అనంతరం హైదరాబాద్, విజయ్ సొంత గ్రామంలో ఘనంగా వేడుకలు సైతం నిర్వహించారు. ఇటీవల ఈ కొత్త జంట అత్యంత సన్నిహితులతో బడ్డీమూన్కు సైతం వెళ్లింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే.. తాజాగా రష్మిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఓ క్యూట్ వీడియోను షేర్ చేసిన రష్మిక.. “ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం” (Now we are three) అని క్యాప్షన్లో పేర్కొంది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. తాజాగా షేర్ చేసిన ఈ వీడియో ఒక యానిమేషన్ వీడియో. ఇందులో విజయ్, రష్మికలతో పాటు ఒక పొద్దుతిరుగుడు పువ్వు ఉంది. రష్మిక ధరించిన టీ-షర్ట్పై గుడ్డు బొమ్మ ఉండటం విశేషం. ఈ స్మాల్ వీడియో క్లిప్ ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారింది.
READ MORE: Trump: ఇరాన్లో ఇంకా విధ్వంసం మొదలవ్వలేదు.. భారీ వంతెన కూల్చిన తర్వాత ట్రంప్ ప్రకటన
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే రష్మిక.. ఇటీవల తన ప్రేమ ప్రయాణం, పెళ్లి గురించి ఒక నెటిజన్ రాసిన కథనంపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యింది. తన బ్లాగ్లో ఒక అభిమాని వీరిద్దరి కెరీర్, ప్రేమ, పెళ్లి గురించి ఎంతో హృద్యంగా వివరించారు. దీనిపై స్పందించిన రష్మిక.. “చాలా రోజుల తర్వాత నా గురించి రాసిన ఒక ఆర్టికల్ చదివి కళ్లు చెమర్చాయి. చెప్పాలని చాలా ఉంది కానీ మాటలు రావడం లేదు. నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ఈ ప్రయాణంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా భావాలను ఇంత అందంగా గుర్తించి రాసినందుకు ధన్యవాదాలు. ప్రేమ గురించి నేనొకటే చెబుతాను.. మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి.” అని రాసుకొచ్చింది.