TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్‌ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!

  • వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ వ్యవహారం వివాదాస్పదం
  • రూ.700 టికెట్‌ను రూ.380కే ఏర్పాటు చేస్తానన్నట్లు టీటీఈపై ఆరోపణలు
  • ప్రయాణికుడు రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్..
Tte Suspended

Tte Suspended

TTE Suspended: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ వ్యవహారంపై వెలుగులోకి వచ్చిన ఒక వైరల్ వీడియో భారతీయ రైల్వేలో కలకలం రేపింది. సాధారణంగా రూ.700కు లభించే టికెట్‌ను కేవలం రూ.380కే ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)పై రైల్వే శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీయగా, రైల్వే టిక్కెటింగ్ విధానాల పారదర్శకతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.

ఈ వివాదానికి కారణమైన వీడియోలో ఒక ప్రయాణికుడు, టీటీఈ మధ్య జరిగిన సంభాషణ కనిపించింది. రైలులోని కోచ్‌ వద్ద నిలబడి మాట్లాడుతున్న టీటీఈ, అధికారిక బుకింగ్ ద్వారా టికెట్ తీసుకుంటే దాదాపు రూ.700 ఖర్చవుతుందని, అయితే తాను రూ.380కే ప్రయాణాన్ని ఏర్పాటు చేయగలనని చెప్పినట్లు వీడియోలో వినిపించింది. ఆ సమయంలో ప్రయాణికుడు వీడియో రికార్డ్ చేస్తూ ప్రశ్నలు అడగగా, “ఇది సాధారణంగా అనుమతించబడదు” అని టీటీఈ చెప్పినట్లు కూడా క్లిప్‌లో ఉంది. అయితే పూర్తి సంభాషణ స్పష్టంగా బయటకు రాకపోయినా, చాలామంది నెటిజన్లు దీన్ని అధికారిక రిజర్వేషన్ వ్యవస్థకు బయట టికెట్ జారీ ప్రయత్నంగా భావించారు.

వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. రైల్వే సేవా, దానాపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) అధికారిక హ్యాండిల్స్ ద్వారా చర్యలు ప్రారంభించినట్లు ప్రకటించారు. అనంతరం విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత టీటీఈను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ఖాళీ సీట్లు కేటాయించడం లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఆన్‌బోర్డ్ టికెట్లు జారీ చేయడం టీటీఈలకు అనుమతించబడుతుంది. అయితే నిర్ణయించిన ఛార్జీలకు భిన్నంగా డబ్బులు తీసుకోవడం లేదా అనధికారిక టికెట్ వ్యవహారాలు నిర్వహించడం తీవ్రమైన తప్పిదంగా పరిగణించబడుతుంది.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రయాణికులకు సాయం చేయాలనే ఉద్దేశంతో టీటీఈ వ్యవహరించి ఉండొచ్చని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఇది రైల్వే వ్యవస్థలో పారదర్శకతను దెబ్బతీసే చర్య అని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవల్లో అవినీతి, అనధికారిక లావాదేవీలపై ప్రజల్లో ఇప్పటికే ఉన్న అనుమానాలకు ఈ ఘటన మరింత బలం చేకూర్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.