NTV Telugu Site icon

Vande Bharat : త్వరలో పెరగనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ భోగీలు

Vande Bharat

Vande Bharat

Vande Bharat : వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 8న ఏపీ, తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న.. సికింద్రబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్‌- తిరుపతి (20701) మధ్య మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే ప్రయాణ సమయం ఉండటంతో రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో మధ్యాహ్నం 03:15కి బయలుదేరి.. రాత్రి 11:45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Read Also: Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

ఇటీవల ప్రయాణికుల రద్దీ పెరగడంతో రిజర్వేషన్‌ దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలులో ప్రస్తుతం 7 ఏసీ బోగీతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కారు బోగీ ఉంది. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌- విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుతో సమానంగా .. సికింద్రాబాద్‌- తిరుపతి రైలుకు బోగీల సంఖ్య పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పెంచే ఆలోచనలో ఉంది. త్వరలోనే 16 బోగీలతో నడిపేందుకు ద.మ.రైల్వే ప్రణాళిక రూపొందిస్తోంది. తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే నారాయణాద్రి, వెంకటాద్రి, శబరి, రాయలసీమ తదితర రైళ్లతో సామానంగా టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు. వందేభారత్‌ అందుబాటులోకి రావడంతో సాధారణ రైళ్ల కంటే వందేభారత్‌కు ఆదరణ మరింత పెరిగింది. సికింద్రాబాద్, తిరుపతి మధ్య నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే వందేభారత్‌ ట్రైన్ ఆగుతుంది. గుంటూరులో 5 నిమిషాలు, మిగతా స్టేషన్‌లలో ఒక నిమిషం పాటు మాత్రమే నిలుపుతారు. మొత్తం 660.77 కి.మీ. దూరాన్ని ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుంది.

Read Also: Tamilnadu: యువకుడిపై లైంగికదాడి.. వీడియో తీసి బెదిరించి..