ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో మరోసారి విధ్వంసం సృష్టించడానికి వైభవ్ సూర్యవంశీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ గత సీజన్లో బ్యాట్తో విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా, వైభవ్ ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ భారత బ్యాట్స్మెన్గా, సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత్ విజయంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు. 14 ఏళ్ల వైభవ్ తన రెండవ ఐపీఎల్ సీజన్కు సిద్ధమవుతున్నాడు. ఈ సీజన్లో అతని నుంచి మరో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ను అభిమానులు ఆశిస్తున్నారు. ఐపీఎల్ 19వ సీజన్లో తన లక్ష్యం ఏమిటని ఒక జర్నలిస్ట్ అడిగారు. ఈ ప్రశ్నకు అతను చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
మీడియాతో సంభాషణ సందర్భంగా, ఒక జర్నలిస్ట్, “ఐపీఎల్ 2026 కోసం మీ ప్రణాళికలు ఏమిటి? అంటే, మీరు ఎన్ని పరుగులు చేయాలనుకుంటున్నారు, ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ కోసం మీ లక్ష్యం ఏమిటి?” అని అడిగారు. దానికి వైభవ్, “మీరు నన్ను అలాంటి ప్రశ్నలు అడిగితే, రెండు నుంచి మూడు వేల పరుగులు అని చెబుతాను” అని బదులిచ్చారు. ఇది విన్న ఇతర రాజస్థాన్ ఆటగాళ్లు పగలబడి నవ్వారు.
వైభవ్ మాట్లాడుతూ, “నేను పరుగుల కోసం ఎలాంటి నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. నేను ఆట తీరును గమనిస్తున్నాను, జట్టు కోసం ట్రోఫీని గెలవాలనుకుంటున్నాను. మేము వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెట్టడం లేదు. ఈ సీజన్లో బాగా రాణించడమే మా లక్ష్యం అని తెలిపాడు. 2025 సీజన్కు ముందు జరిగిన వేలంలో వైభవ్ను దక్కించుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ రూ.1.1 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఏడు మ్యాచ్లలో 36.00 సగటుతో, 206.56 స్ట్రైక్ రేట్తో 252 పరుగులు చేసి యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గత సీజన్లో, వైభవ్ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాధించాడు.
Typical Vaibhav 😂🔥 pic.twitter.com/3rkxF1WLFl
— Rajasthan Royals (@rajasthanroyals) March 21, 2026
