భారత క్రికెట్లో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది, అదే.. వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసి, 237.30 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన ఈ 15 ఏళ్ల యువ సంచలనానికి భారత సీనియర్ టీ20 జట్టులో తొలిసారి చోటు దక్కింది. జూన్ 26, జూన్ 28 తేదీల్లో ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్లు, ఆ తర్వాత జూలైలో ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఈ పర్యటనల్లో గనుక వైభవ్ బరిలోకి దిగితే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉన్న అత్యంత చిన్న వయసులో భారత్ తరఫున అరంగేట్రం చేసిన రికార్డును బద్దలు కొడతాడు కేవలం అరంగేట్రం రికార్డే కాదు, వైభవ్ క్రీజులో ఉంటే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సెంచరీల రికార్డులు కూడా బద్దలవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనపై భారీ అంచనాలు..
ప్రస్తుతం టీ20 జట్టులో ఎంపికైన వైభవ్, భవిష్యత్తులో వన్డేల్లోనూ అరంగేట్రం చేసి తన హిట్టింగ్ పవర్ను చూపిస్తే దిగ్గజాల రికార్డులన్నీ గాల్లో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ వన్డేల్లో అవకాశం వస్తే, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ రికార్డు ప్రమాదంలో పడినట్లే. భారత పురుషుల క్రికెట్లో అత్యంత వేగవంతమైన టాప్-5 వన్డే సెంచరీల్లో.. విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 100 చేశాడు. అది కూడా ఆస్ట్రేలియా (జైపూర్, 2013)పైన. తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ 60 బంతుల్లో వర్సెస్ న్యూజిలాండ్ (హామిల్టన్, 2009), మూడో ప్లేస్ లో.. మహమ్మద్ అజహరుద్దీన్ 62 బంతుల్లో వర్సెస్ న్యూజిలాండ్ (వడోదర, 1988), కె.ఎల్. రాహుల్ 62 బంతుల్లో వర్సెస్ నెదర్లాండ్స్ (బెంగళూరు, వన్డే వరల్డ్ కప్ 2023), యువరాజ్ సింగ్ 64 బంతుల్లో వర్సెస్ ఇంగ్లాండ్ (రాజ్కోట్, 2008) పైన ఫాస్టెస్ట్ సెంచరీలు బాదారు.
వైభవ్ ఆడే దూకుడు చూస్తుంటే కోహ్లీ సాధించిన 52 బంతుల రికార్డు మాత్రమే కాదు, ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలోనే సౌతాఫ్రికా రికార్డు బ్రేకర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ఆల్టైమ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు(31 బంతుల్లో) కూడా బద్దలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డుకు సైతం ముప్పు..
ఒకవేళ వన్డేల్లో కాకుండా, ప్రస్తుత ఇంగ్లాండ్, ఐర్లాండ్ లతో జరిగే టీ20 సిరీస్లనే వైభవ్ సూర్యవంశీ వేదికగా చేసుకుంటే హిట్మ్యాన్ రికార్డు కరిగిపోవడం ఖాయం. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో (T20I) భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. ఆయన 2017లో శ్రీలంకపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఐపీఎల్లోనే కేవలం 36 బంతుల్లో సెంచరీ కొట్టి, 72 సిక్సర్లతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ, ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెడుతూనే రోహిత్ శర్మ రికార్డును అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా ఈ యువ సంచలనం రాకతో క్రికెట్ రికార్డుల బుక్ తిరగరాయబడటం ఖాయంగా కనిపిస్తోంది.

