సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు రామలింగేశ్వర స్వామి వారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అయితే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అధికారులు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుండి 14 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని, బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే.. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మాత్రమే అన్ని రకాలుగా లాభపడ్డారన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీటిని మరింత విస్తరిస్తామని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు పెంచుతామన్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పునరుద్ధరిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయమన్నారు ఉత్తమ్ కుమార్. 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. మేమంతా రామ భక్తులమే రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్ గా మారుస్తున్నారన్నారు. శంకరాచార్యులు , మఠాధిపతులు రామమందిర ప్రతిష్ఠకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సమాధానం చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
