Uttam Kumar Reddy : తెలంగాణ హక్కుల కోసం ఒక్క అవకాశాన్ని వదులుకోం

  • కృష్ణా జలాల వివాదంపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ
  • న్యాయవాదుల బృందానికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి భరోసా
  • తెలంగాణ రైతుల న్యాయం కోసం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌లో స్వయంగా హాజరు
Uttam

Uttam

Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఒక్క అవకాశాన్ని కూడా కోల్పోకుండా కట్టుబడి పని చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రోజున రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, కృష్ణా జలాల వివాదాల నేపథ్యంలో న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు విచారణలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు.

న్యాయవాదుల బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, అవసరమైతే విచారణలకు స్వయంగా హాజరవుతానని మంత్రి తెలిపారు. గతంలో తీసుకున్న వక్రీకృత నీటి కేటాయింపుల వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరిగిందని, ఇప్పుడు వాటిని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఇక గోదావరి, కృష్ణా జలాలపై రాష్ట్రం న్యాయ పోరాటానికి సిద్ధమైందని తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన 2014 తర్వాత తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగునీటి పంపిణీపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, బనకచర్ల ప్రాజెక్టుల నిర్వహణపై అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో, సుప్రీం కోర్టులో తమ వాదనలను న్యాయబద్ధంగా వినిపించి రాష్ట్ర హక్కులను సమర్థవంతంగా రక్షిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.

Siddu Jonnalagadda : మేమిద్దరం దాని కోసం కొట్టుకున్నాం.. సిద్ధు జొన్నలగడ్డ షాకింగ్ కామెంట్స్