Site icon NTV Telugu

Ustaad Bhagat Sing : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

Ustaad

Ustaad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న తరుణంలో, సినిమా టికెట్ ధరలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు మైత్రీ మూవీ మేకర్స్ తెరదించింది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పుడు మొదటి వారం లేదా పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవడం టాలీవుడ్‌లో ఆనవాయితీగా మారింది. కానీ, నైజాం ఏరియా పంపిణీ బాధ్యతలు కూడా చూస్తున్న మైత్రీ సంస్థ, ఇక్కడ సాధారణ ధరలకే (Regular GO Prices) సినిమాను ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణలో గురువారం ఉదయం 7:30కే షో పడనుంది.

ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాల దృష్ట్యా న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడటం. రెండోది, సామాన్య ప్రేక్షకుడికి కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా థియేటర్లకు భారీగా జనాలను రప్పించడం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు , బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినప్పటికీ, తెలంగాణలో మాత్రం ఎటువంటి అదనపు భారం లేకుండానే పవన్ కళ్యాణ్ మాస్ పవర్ ను వెండితెరపై చూసే అవకాశం లభించింది.

ఈ నిర్ణయం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం, పాత ధరలకే లభించడం వల్ల ఓపెనింగ్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మార్చి 19న ఉగాది పండుగ కానుకగా ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.

Sri Lanka Fuel Crisis: శ్రీలంక ను కుదిపేస్తున్న ఇంధన కొరత.. పనిదినాలు కుదింపు..

Exit mobile version