ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా హంతకుల్లో మార్పు రావడం లేదు. కలకాలం తోడుంటానని ప్రమాణం చేసిన భాగస్వాములను అత్యంత దారుణంగా కడతేర్చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో చోటుచేసుకుంది.
ఖుష్బూ, అర్జున్ భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. లూథియానాలో కూలీగా పని చేస్తున్న అర్జున్ డిసెంబర్ 21న గోరఖ్పూర్కు వచ్చాడు. అయితే భార్య ఖుష్బూ రహస్యంగా మొబైల్ ఫోన్ వాడడం చూసి నిర్ఘంతపోయాడు. భర్త రాగానే ఫోన్ను రహస్యంగా దాచిపెట్టేసింది. దీంతో అదే రాత్రి భార్యతో వాగ్వాదం పెట్టుకుని గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుక ఆరు అడుగుల భారీ గుంత తవ్వేసి మంచంతో పాటే పాతిపెట్టేశాడు.
అనంతరం అర్జున్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఖుష్బూ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. దీంతో రోజుల తరబడి ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఏ ఆధారం లభించలేదు. దీంతో బాధితురాలి తండ్రి, అర్జున్ మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Silver Rates: బాబోయ్ సిల్వర్.. మరోసారి భారీగా పెరిగిన వెండి ధర
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మృతదేహాన్ని నదిలో విసిరేసినట్లు పేర్కొన్నాడు. దీంతో నిందితుడిని గ్రామం వెలుపల ఉన్న నది ఒడ్డుకు తీసుకెళ్లి గంటల తరబడి వెతికించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో అర్జున్ విచారించగా నేరాన్ని అంగీకరించాడు. చంపేసి ఇంటి వెనుక పాతిపెట్టినట్లుగా తెలిపాడు. దీంతో పోలీసులు గుంతను తవ్వగా మృతదేహం కనిపించింది.
ఇది కూడా చదవండి: Canada: కెనడాలో మరో ఘోరం.. టొరంటో వర్సిటీలో భారతీయ విద్యార్థి హత్య
అక్రమ సంబంధం ఉన్న అనుమానంతో భార్యను చంపేశాడని గోరఖ్పూర్ సర్కిల్ ఆఫీసర్ శిల్పా కుమారి తెలిపారు. పెళ్లై రెండేళ్లు అయిందని.. పిల్లలు పుట్టలేదని చెప్పారు. బాధితురాలి తమ్ముడి ఫిర్యాదు ఆధారంగా అర్జున్ను అరెస్టు చేయగా.. మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష కోసం పంపారు.
