Bullet Train: 2026 నాటికి అందుబాటులోకి బుల్లెట్‌ రైలు: అశ్వినీ వైష్ణవ్‌

Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

Indias First Bullet Train Update: భారత దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై తాజాగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. 2026 నాటికి బుల్లెట్‌ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందని రైల్వే మంత్రి చెప్పారు. మంగళవారం ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న అశ్వినీ వైష్ణవ్‌.. పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభిస్తామని తెలిపారు.

‘బుల్లెట్‌ రైలు కోసం 500 కిమీల ప్రాజెక్టును నిర్మించేందుకు పలు దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. భారత్‌ మాత్రం 8-10 సంవత్సరాల్లోనే పూర్తిచేయనుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును పూర్తిచేస్తాం. 2026 నాటికి బుల్లెట్‌ రైలు పట్టాలెక్కనుంది. ముందుగా గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు నడపనున్నాం. 2028 నాటికి ముంబై-అహ్మదాబాద్‌ పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’ అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు.

Also Read: Vijay Sethupathi-Vote: మత రాజకీయాలు చేసే వారికి ఓటు వెయ్యొద్దు.. విజయ్ సేతుపతి వీడియో వైరల్!

దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్న అహ్మదాబాద్‌-ముంబై మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే.. 2.58 గంటల్లోనే అహ్మదాబాద్‌ నుంచి ముంబై చేరుకోవచ్చు. 2028 నాటికి అహ్మదాబాద్‌-ముంబై పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది. జపాన్ షింకన్‌సెన్ టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తోంది. రూ.1.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.