తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. రానున్న దసరాలోపే జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్న నేపథ్యంలో.. తాజాగా నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. వ్యవసాయ మోటర్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్ల పెట్టేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నీకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు… బీజేపీ స్వీప్ చేస్తుందన్నారు. అంతేకాకుండా.. మీ అవినీతి కుటుంబ పార్టీలు ఏకమైనా మోడీనీ ఏమి చేయలేవు అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్.. నరేంద్ర మోడీ నీ ఏ విషయంలో పోటీ పడుతారు… మీది అవినీతి కుటుంబం.. కేంద్ర ప్రభుత్వం మోటర్ల కు మీటర్లు పెట్టదు అంటూ ఆయన స్పష్టత ఇచ్చారు.
కేసీఆర్ ఎక్కువ రోజులు ఉంటే విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, 40 వేల కోట్లు అప్పు ఉందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రైతులారా, విద్యుత్తు ఉద్యోగులారా కేసీఆర్ను నమ్మకండి.. కేసీఆర్ కుటుంబం అవినీతితో ఎంత దోచుకున్నారో కక్కించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది.. మజ్లిస్ కి బిజెపి భయపడదు.. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు తాగుతుంది నీవు కేసీఆర్.. మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టిన పార్టీ పాలన దేశానికి కావాలా కేసీఆర్.. ఈ దశాబ్దానికి అతి పెద్ద జోక్ కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. నిజాంని మించిన నిజాం కేసీఆర్.. కేసీఆర్ అరాచకవాది.. బీజేపీయేతర పార్టీలకు డబ్బులు ఎలా పంపిణీ చేస్తున్నావు కేసీఆర్.. తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు.
