Union Cabinet: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పసుపుపై అవగాహన, వినియోగం, ఎగుమతి పెంచడానికి అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అభివృద్ధి చేయడంలో ఈ బోర్డు సహాయపడుతుందని తెలిసిన విషయమే. దీంతో పాటు రూ.889 కోట్లతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యునివర్సిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబరు 1న తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. కృష్ణా వాటర్ వివాదాల పరిష్కారం కోసం కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read: AP CM Jagan: ఫుడ్ ప్రాసెసెంగ్ యూనిట్లను ప్రారంభించిన సీఎం జగన్
వీటితో పాటు కేంద్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి మరో రూ.100 సబ్సిడీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఆగస్టులో ఉజ్వల లబ్ధిదారులకు కేంద్రం రూ. 200 సబ్సిడీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సబ్సిడీ రూ.300కు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రక్షా బంధన్ సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింది. నేటి నుంచి ఉజ్వల పథకం లబ్ధిదారులకు సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచుతున్నారు. కేబినెట్ నిర్ణయాల గురించి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రూ.1,600 కోట్ల విలువైన పసుపును ఎగుమతి చేస్తున్నామని, ఇప్పుడు రూ.8,400 కోట్లకు చేరుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, జాతీయ పసుపు బోర్డును సృష్టించడం అవసరం.
