NTV Telugu Site icon

Bhadradri: భద్రాద్రి తలంబ్రాలకు భలే డిమాండ్.. ఆర్టీసీ డోర్‌ డెలివరీకి అనూహ్య స్పందన

Tsrtc

Tsrtc

Bhadradri Ramaiah Kalyana Talambralu: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలంబ్రాలకు ఈ ఏడాది ఊహించని విధంగా స్పందన లభించింది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం దాదాపు 20వేల మంది అధికంగా తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా భక్తులు తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. టీఎస్‌ఆర్టీసీ ద్వారా తలంబ్రాలను బుక్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. మొదటి దశలో 50,000 మందికి ఆర్టీసీ తలంబ్రాలను డోర్‌ డెలివరీ చేస్తోంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బుకింగ్స్‌కు అవకాశం కల్పిస్తూ గడువును ఏప్రిల్ 10వ తేదీ వరకు పొడిగించారు. ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకున్న భ‌క్తుల‌కు త‌లాంబ్రాల‌ను రెండు, మూడు రోజుల్లో అంద‌జేయనున్నారు.

Read Also: Prisoner Escape: సబ్‌ జైలు నుంచి ఖైదీ పరారీ.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

భద్రాద్రి రాముల వారి కల్యాణ తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలి బుకింగ్ చేసుకోగా.. హైదరాబాద్‌ బస్‌భవన్‌లో ఇవాళ ఆయనకు సంస్థ లాజిస్టిక్స్ బిజినెస్‌ హెడ్‌ పి.సంతోష్‌కుమార్ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. భ‌ద్రాద్రి శ్రీ సీతారాముల క‌ల్యాణోత్సవం త‌లాంబ్రాల కోసం భ‌క్తుల నుంచి భారీగా బుకింగ్స్ వ‌స్తున్నాయ‌ని సజ్జనార్ చెప్పారు. గ‌తేడాది 88 వేల మంది బుక్ చేసుకోగా, ఈ ఏడాది ల‌క్ష మందికి పైగా బుక్ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. మొదటగా 50,000 మందికి తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం హోం డెలివరీ చేస్తోందని ఆయన వివరించారు. దేవాదాయ శాఖ సహకారంతో వాటిని భక్తులకు అందజేస్తున్నామని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. భ‌ద్రాద్రి త‌లాంబ్రాలు కావాల‌నుకునే వారు.. టీఎస్ ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంట‌ర్ల వ‌ద్ద బుక్ చేసుకోవ‌చ్చు. 9177683134, 7382924900, 9154680020 నంబ‌ర్లను సంప్రదించొచ్చు అని సూచించారు. భక్తులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకుని విశిష్టమైన తలంబ్రాలని పొందాలని ఆయన సూచించారు.