Site icon NTV Telugu

Goa: విద్యార్థిపై ఇద్దరు టీచర్లు పైశాచికం.. చెప్పుతో కొట్టి, తన్ని

Goa Student

Goa Student

గోవాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు పైశాచికానికి పాల్పడ్డారు. 9 ఏళ్ల విద్యార్థిని చితకబాదారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఈ క్రమంలో.. చిన్నారిని దారుణంగా కొట్టిన ఇద్దరు ఉపాధ్యాయులు సుజల్ గావ్డే, కనీషా గడేకర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారి తన పుస్తకంలోని పేజీలను చింపివేయడంతో కోపాద్రిక్తులైన టీచర్లు.. విద్యార్థిని దారుణంగా చితకబాదారు. దీంతో విద్యార్థి చేతులు, తొడలు, కాళ్లు, వీపుకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. సాయంత్రం ఇంటికి వెళ్లిన తన కుమారుడిని చూసి తండ్రి చలించిపోయాడు. దీంతో.. చిన్నారి తండ్రి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఆగస్టు 2న జరిగింది.

Read Also: Duleep Trophy: అన్న విఫలం.. తమ్ముడు శతకం

ఉపాధ్యాయులు చిన్నారిని స్కేల్‌తో కొట్టడమే కాకుండా చెప్పుతో కొట్టి, కడుపుతో తన్నారని, చెవులు పట్టుకుని బ్లాక్‌బోర్డ్‌పై ముఖాన్ని లాగారని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. పిల్లలకు చదువు చెప్పాల్సిన పాఠశాలలోనే ఇంత దారుణం జరగడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ ఘటన తర్వాత టీచర్లిద్దరినీ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరోవైపు.. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకున్న పోలీసులు.. ఉపాధ్యాయులపై గోవా చిల్డ్రన్స్ యాక్ట్ సెక్షన్ 8, జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 82, ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ కింద కేసు నమోదు చేశారు.

Read Also: Sikkim: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ఆర్మీ వాహనం, నలుగురు సైనికులు మృతి

ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ, పోలీసు శాఖలు కఠిన చర్యలు తీసుకుంటాయని అన్నారు. ప్రమోద్‌ సావంత్‌కు రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు కూడా ఉండడం గమనార్హం.

Exit mobile version