Turkey Supports Iran: ఇరాన్ – అమెరికా & ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సరికొత్త మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు తటస్థంగా ఉన్నట్లు కనిపించిన టర్కీ, తొలిసారిగా ఇరాన్కు తన బహిరంగ మద్దతును ప్రకటించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
సున్నీ-షియా విభేదాలు లేవు.. మనమంతా ఒక్కటే..
అంకారాలో తన పార్టీ ఎంపీలతో జరిగిన రహస్య సమావేశంలో ఎర్డోగన్ కీలక ప్రసంగం చేశారు. “నేను సున్నీని కాదు, వారు (ఇరాన్) షియా కాదు.. మనమందరం ముస్లింలం. ఇది మనమంతా ఏకమవ్వాల్సిన సమయం” అని ఆయన పిలుపునిచ్చారు. సంక్షోభ సమయాల్లో తన సోదర దేశాలకు దూరం అయ్యే వ్యక్తిని తాను కాదని, యుద్ధాన్ని ఆపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
యుద్ధానికి కారణం ఇజ్రాయెలే..
‘డైలీ సబా’ నివేదిక ప్రకారం, ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ అని ఎర్డోగన్ విమర్శించారు. “యుద్ధం ఇజ్రాయెల్ వల్లే మొదలైంది, వారే దీనిని ఆపాలి. ఒకవేళ అమెరికా దౌత్యానికి ప్రాధాన్యత ఇస్తే యుద్ధం ముగుస్తుంది, ఇందులో టర్కీ మధ్యవర్తిగా చురుకైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. టర్కీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ మాట్లాడుతూ.. టర్కీ కూడా ఇరాన్ మార్గాన్నే అనుసరిస్తోందని ఆరోపించారు. హమాస్, ఖతార్, సిరియాలతో కలిసి టర్కీ ఒక కొత్త ‘సున్నీ ముస్లిం’ కూటమిని ఏర్పాటు చేస్తోందని, దీని లక్ష్యం ఇజ్రాయెల్కు హాని కలిగించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ దూకుడుగా దాడి చేయని ఏకైక దేశం టర్కీ కావడం గమనార్హం. టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్, ఇతర మంత్రులు ఎంపీలకు ఈ సంక్షోభంపై రహస్య సమాచారాన్ని అందించారు. ఇరాన్లో జరుగుతున్న మరణాలను గాజా ఊచకోతతో పోల్చిన టర్కీ పార్లమెంట్ స్పీకర్, అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే తాము మౌనంగా ఉండలేమని తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఎర్డోగన్ అటు ఇరాన్, ఇటు అమెరికా మధ్య రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, టర్కీ బహిరంగంగా ఇరాన్ పక్షాన నిలబడటం మధ్యప్రాచ్య యుద్ధ సమీకరణాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!