తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023 ఫలితాలు రేపు (సెప్టెంబర్ 27) విడుదల చేయనున్నారు. ఇప్పటికే టెట్ పరీక్ష కు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఫైనల్ ఆన్సర్ కీ తో పాటు ఫలితాలను కూడా బుధవారం విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెట్కు హాజరైన అభ్యర్ధులు సెప్టెంబర్ 27వ తేదీన తుది ‘కీ’ తో పాటు ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు.అయితే టెట్ పరీక్ష పేపర్-1కు దాదాపు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.అలాగే పేపర్ 2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే.. వారిలో 1,89,963 మంది అంటే 91.11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5089 ఉపాధ్యాయ పోస్టులకు సెప్టెంబర్ 7 న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 వ తేదీ నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. నవంబర్ 20 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనుంది. దీనితో టెట్ ఫలితాల ప్రకటన తరువాత అందులో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసే వీలు ఉంటుంది. దీనితో టెట్ ఫలితాలను వెంటనే ప్రకటించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉంటే సోమవారం (సెప్టెంబర్ 25)సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సీటెట్ 2023 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 29 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. సీ టెట్ లో అర్హత సాధించిన వారు కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఆర్టీ కి అర్హులే…