తెలంగాణ విద్యాశాఖ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో ఇంటర్వ్యూలు లేకుండానే ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పారదర్శకతను పెంచాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మొత్తం 1,000 అధ్యాపక పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది.
యూనివర్సిటీల వారీగా ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
అగ్రికల్చర్ యూనివర్సిటీ (566 పోస్టులు): 48 ప్రొఫెసర్, 148 అసోసియేట్, 370 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.
ఉద్యాన యూనివర్సిటీ (140 పోస్టులు): 17 ప్రొఫెసర్, 44 అసోసియేట్, 79 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.
పశువైద్య యూనివర్సిటీ (294 పోస్టులు): 235 పశువైద్య, 20 డెయిరీ, 39 మత్స్యశాఖ పోస్టులు.
ఎంపిక విధానం, మార్కుల కేటాయింపు ఇలా..
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు (మొత్తం 100 మార్కులు):
రాత పరీక్షకు 50 మార్కులు, అకడమిక్ మెరిట్ (విద్యార్హతలు)కు 50 మార్కులు కేటాయించారు. ఈ 50 మార్కుల వెయిటేజీ విభజన ఇలా ఉంటుంది:
బ్యాచిలర్ డిగ్రీ: 10%
మాస్టర్స్ డిగ్రీ: 15%
పీహెచ్డీ: 5%
అంతర్జాతీయ ఫెలోషిప్: 5%
గోల్డ్ మెడల్: 3%
జర్నల్ ఆర్టికల్స్: 4%
ఆవిష్కరణలు/పేటెంట్లు: 4%
పరిశోధన అనుభవం: 4%
2. అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ పోస్టులు:
ఐకార్ (ICAR), యూజీసీ (UGC) మార్గదర్శకాల ప్రకారం విద్యార్హతలకు ఏకంగా 80 శాతం మార్కులు, అభ్యర్థి బోధనా నైపుణ్యాన్ని పరిశీలించే ‘డెమో లెక్చర్’కు 20 శాతం మార్కులు కేటాయించారు. ప్రభుత్వం నుంచి అధికారిక తుది ఆమోదం లభించిన వెంటనే వీటికి సంబంధించిన వరుస నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

