Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..

Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పరిధిని పెంచే ఓ కీలక చట్టంపై శుక్రవారం సంతకం చేశారు. ఈ నూతన చట్టం ప్రకారం రష్యా నుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేసే భారత్, చైనాల వంటి దేశాలపై విపరీతమైన సుంకాలను (టారిఫ్‌లు) విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. ‘లిండ్సే ఓ. గ్రాహమ్ రష్యా అండ్ ఇరాన్ శాంక్షన్స్‌ ఆక్ట్, 2026’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బుధవారమే ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కోసం సౌత్ కరోలినాకు చెందిన దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ఏడాదికి పైగానే శ్రమించారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం దీనికి ఆ పేరే పెట్టారు. వైట్ హౌస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ చట్టం రష్యాపై చట్టపరమైన ఆంక్షలు, సుంకాలు విధించేందుకు పూర్తి అధికారాలను ఇవ్వడమే కాకుండా, ఇరాన్‌పై ఇదివరకే ఉన్న ఆంక్షలను పొడిగిస్తుంది.

ఈ చట్టం ద్వారా లభించిన అధికారంతో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌లను విధించవచ్చు. ఆయా దేశాలపై ఎంతెంత టారిఫ్ వేయాలనేది పూర్తిగా అధ్యక్షుడి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ట్రంప్ గనుక భారతదేశంపై 100 శాతం టారిఫ్ విధించాలని నిర్ణయిస్తే, అది మన దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. భారత్ నుంచి అమెరికా మార్కెట్‌కు వెళ్లే ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోయి, అక్కడ మన వస్తువుల విక్రయాలు తగ్గిపోతాయి. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి పడుతుంది. ఇక, ఈ కొత్త చట్టం రష్యాలోని కీలక అధికారులను, బ్యాంకింగ్ రంగాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. వాటితో పాటు రష్యన్ ఇంధనాన్ని రహస్యంగా సరఫరా చేస్తూ అంతర్జాతీయ ఆంక్షలను తిప్పికొట్టే ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. మొత్తానికి రష్యా, ఇరాన్‌ల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో పాటు, రష్యా వద్ద చమురు కొనుగోలు చేసే పెద్ద దేశాలను 100% టారిఫ్‌ల బెదిరింపుతో అదుపు చేయడమే లక్ష్యంగా అమెరికా ఈ కొత్త చట్టాన్ని ఆమోదించింది.