Uttarpradesh: ఢిల్లీ తరహాలో మరో ఘటన.. మహిళను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు..

Banda Accident

Banda Accident

Uttarpradesh: ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏళ్ల యువతిని కారు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ ఘటనపై చర్చ జరుగుతుండగానే యూపీలోని బాండాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. బాండా జిల్లా మావాయ్‌ బజ్‌రంగ్‌లో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను ట్రక్కు ఢీకొట్టింది.. అనంతరం ఆమెను 3 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Horrific Accident: దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి

లక్నోకు చెందిన పుష్పదేవి అనే మహిళ బజ్‌రంగ్‌లోని బీకే గుప్తా యూనివర్సిటీలో క్లర్కుగా విధులు నిర్వహిస్తోంది. ఆమె బుధవారం రాత్రి నిత్యావసర సరుకుల కోసం తన స్కూటీపై వెళ్తోంది. ఈ క్రమంలో ఆమెను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆమె స్కూటీతో పాటు ట్రక్కు చాసిస్‌లో చిక్కుకుపోయింది. అయినప్పటికీ డ్రైవర్ ఆపకుండా అలానే వెళ్లడంతో మంటలు అంటుకోగా స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. తోటి వాహనదారులు లారీని వెంబడించినప్పటికీ డ్రైవర్‌ ఆపకుండానే 3 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ట్రక్కు కింద ఉన్న మహిళను వెలికితీయగా.. ఆమె అప్పటికే మరణించిందని పోలీసులు వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్‌ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.