ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ కంపెనీ షేర్లు ఇటీవల ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ 4 శాతం మేర లాభపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నుంచి రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల విలువైన కొత్త తయారీ వర్క్ ఆర్డర్ లభించడమే ఈ భారీ రాలీకి ప్రధాన కారణం. ఈ ప్రాజెక్ట్ను 13 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంది. దీనికి ముందే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కంపెనీకి రూ. 1000 కోట్లకు పైగా విలువైన గిగా ప్రాజెక్ట్ లభించింది. వరుసగా పెద్ద కాంట్రాక్టులు దక్కడంతో ఇన్వెస్టర్లలో ఆశావాదం పెరిగింది.
మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలో ఈ షేరు రూ. 292.70 వద్ద నమోదు కాగా.. రోజంతా సానుకూల ధోరణి కొనసాగి ఇంట్రా-డేలో రూ. 305.65 గరిష్ఠ స్థాయిని తాకింది. ఒకప్పుడు రూ. 2 కంటే తక్కువ ధరకు లభించిన ఈ పెన్నీ స్టాక్, దీర్ఘకాలంలో ఊహించని రీతిలో మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. గత ఏడాది కాలంలో 40 శాతం, రెండేళ్లలో 11 శాతం మేర పతనమై తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ, దీర్ఘకాలికంగా బలంగా నిలదొక్కుకుంది. ఐదేళ్ల కాలవ్యవధిలో ఏకంగా 1949 శాతం, పదేళ్లలో 1961 శాతం మేర అసాధారణ వృద్ధిని నమోదు చేసి మదుపరులకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
డివిడెండ్లు , బోనస్ షేర్లతో కూడా కంపెనీ తన వాటాదారులకు అదనపు ప్రయోజనాలను అందించింది. 2025లో ఈ కంపెనీ 1:1 నిష్పత్తిలో అంటే ప్రతీ ఒక షేరుకు మరొక బోనస్ షేరును ఉచితంగా కేటాయించింది. అదే సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 0.20 డివిడెండ్ కూడా ఇచ్చింది. అంతకుముందు 2013లో 9:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చారు. 2017లో స్టాక్ స్ప్లిట్ ద్వారా రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక షేరును 10 చిన్న షేర్లుగా విభజించారు. దీంతో ముఖ విలువ రూ. 1కి తగ్గింది. కొత్తగా లభిస్తున్న భారీ ఆర్డర్లు , గతంలో చూపించిన రాబడుల వల్ల ఈ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఆసక్తికరంగా మారింది.

