Mahesh Goud: పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని.. కొండా సుస్మిత లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ స్పష్టం చేశారు. అనిరుధ్, రాజగోపాల్ డైరెక్ట్ విమర్శలు చేయలేదని.. కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై అధిష్టానం సీరియస్గా ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు పరిస్థితులపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో తాజాగా సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం ఈ మహేష్గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ భేటీపై మల్లు రవి మాట్లాడారు. “మూడు విషయాలపై చర్చ చేశాం. కొండా సురేఖకి ఇచ్చిన నోటీసుకు రిప్లై వచ్చింది. సుస్మిత మాట్లాడిన వీడియోలు చూశాం. సుస్మిత మాట్లాడిన వీడియోలు చూస్తే అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తుంది. కొండా సురేఖ ఇచ్చిన వివరణపై మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. సీఎల్పీలో ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలు చూశాం. ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తాం అన్నారు. అందరి ఫిర్యాదులు తీసుకున్నాక.. మరోసారి భేటీ అవుతాం. చిన్నారెడ్డి కూడా వివరణ ఇచ్చారు. వివరణ చదివాం.. వీడియోలు కూడా చూశాం. ఎమ్మెల్యే మేఘరెడ్డిని కమిటీ ముందుకు పిలుస్తున్నాం. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై మేఘరెడ్డి నుంచి కూడా వివరణ తీసుకుంటాం. ఆదిలాబాద్ ఇష్యూలో కంది శ్రీనివాస్ రెడ్డి, సంజీవ రెడ్డి పంచాయతీలో శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. దీనిపై మంత్రి జూపల్లి తో మాట్లాడాం.. డీసీసీతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ చేసిన తర్వాత గాంధీ భవన్లో మధు యాష్కీ మీద ఆరోపణలు చేశారు. తప్పని సరి పరిస్థితిలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై మాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది. కానీ పార్టీకి నష్టం జరుగుతుంది అని ఫిర్యాదు వచ్చింది. అందుకే నోటీసులు ఇచ్చాం. కొండా సురేఖ సహజ న్యాయం ప్రస్తావన చేశారు. కేబినెట్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ… సీఎం మీద ఎవరు మాట్లాడినా ఖండించాలి. ఎందుకు ఖండించలేదు అనేది కూడా అడుగుతాం. ఎలాగైనా రిప్లై ఇచ్చే హక్కు వాళ్లకు ఉంది. దానిపై మేం అధ్యయనం చేస్తున్నాం. కొండా సురేఖ ఇప్పుడే నాతో మాట్లాడారు.” అని వివరణ ఇచ్చారు.

