బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ప్రియులకు ఊరట. వరుసగా పెరుగుతున్న పసిడి ధరలకు నేడు బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో సోమవారం (సెప్టెంబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. గుడ్రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం దేశంలోని పలు నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,100గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,210లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,230 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా ఉంది.
బురదలో కూరుకున్న విమానం.. తీయడానికి వచ్చిన జేసీబీలు.. సూపర్ ల్యాండిగ్ ఫైలట్ జీ
ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో డ్రైవింగ్కు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయిజ. ఇక్కడ కొన్ని వీడియోలు చూసిన తర్వాత ప్రజలు కన్నీళ్లు వచ్చేలా నవ్వుకుంటారు. ఇది ఎలా జరిగిందో వారు నమ్మరు. డ్రైవర్ నైపుణ్యం కారణంగా ప్రమాదాలు జరిగే ఇలాంటి క్లిప్లు చాలానే ఉన్నాయి. అలాంటి ఒక వీడియోని నేడు ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్స్ చేస్తారు.. ఇంత టాలెంట్ ఉన్న డ్రైవర్ ఎవర్రా బాబు అని?
వైరల్ అవుతున్న వీడియోలో ఒక విమానం పూర్తిగా బురదలో కూరుకుపోయిందని మీరు చూడవచ్చు. కొందరు తమ డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి విమానాన్ని మట్టిలో ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానాన్ని బయటకు తీసేందుకు చాలా మంది అక్కడ ఉన్నారు. అయితే, ఈ వీడియోకు సంబంధించిన సమాచారం బహిర్గతం చేయబడలేదు.
భారత బ్యాటర్ల విధ్వంసం.. కెమరూన్ గ్రీన్ ఖాతాలో చెత్త రికార్డు!
ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11×4, 3×6), శుభ్మన్ గిల్ (104; 97 బంతుల్లో 6×4, 4×6), సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్; 37 బంతుల్లో 6×4, 6×6)ల దాటికి ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేశారు. భారత బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. దాంతో ఆస్ట్రేలియాపై వన్డేల్లో భారత్ అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
భారత బ్యాటర్ల ధాటికి ఆస్ట్రేలియా పేసర్ కెమరూన్ గ్రీన్ ఓ చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున మూడో చెత్త బౌలింగ్ గణాంకాలను (పరుగుల పరంగా) నమోదు చేశాడు. రెండో వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన గ్రీన్.. రికార్డు స్థాయిలో 103 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో మిక్ లెవిస్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో లెవిస్ 113 పరుగులు ఇచ్చాడు. ఆసీస్ తరఫున అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన ఇదే. ఈ నెలలోనే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆడమ్ జంపా 113 పరుగులు సమర్పించుకుని.. ఆసీస్ తరఫున రెండో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు.
వినాయకుడికి నైవేద్యంగా నాన్ వెజ్ .. ఎక్కడో తెలుసా?
మాములుగా దేవుడికి అంటే ఎంతోపద్దతిగా పులిహోర, దద్దోజనం కనిపిస్తాయి.. ఇంకా పండ్లు, పూలు అనేవి కామన్.. కానీ ఎప్పుడైనా దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా మాంసం పెట్టడం ఎప్పుడైనా, ఎక్కడైనా పెట్టడం చూశారా.. కనీసం విన్నారా? లేదు కదూ.. కానీ ఓ ఆలయంలో వినాయకుడికి మాత్రం మాంసం నైవేద్యంగా పెడుతున్నారు.. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కర్ణాటకలోని ఓ వినాయకుడి గుడిలో ఇలా నైవేద్యం పెడుతున్నారు.. వినాయకుడి పూజలో అక్కడి ప్రజలు గణేశుడికి మాంసం, చేపలు, చికెన్ నైవేద్యంగా పెడతారట. సావాజీ కమ్యూనిటీ ఈ విశిష్టమైన ఆచారాన్ని నిర్వహిస్తోంది. రకరకాల నాన్ వెజ్ వంటకాలను నైవేద్యంగా పెడుతుంటారు. తరతరాలుగా ప్రతి ఏటా కొన్ని కుటుంబాలు కలిసి ఇలా మాంసాలను నైవేద్యంగా పెట్టడం ఒక ఆచారంగా నడుస్తోంది..
నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈరోజు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్ లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ ధృవ పత్రం పై ప్రశ్నలపై చర్చ జరుగనుంది. అలాగే.. చంద్రన్న బీమా పథకం, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ లు, విద్యా దీవెన, వసతి దీవెన అంశాల పై ప్రశ్నలు జరుగనున్నాయి. సభలో 9 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్ -2023, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు -2023, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్-2023, ఆంధ్రప్రదేశ్ భూదాన్ అండ్ గ్రామ దాన్ సవరణ బిల్, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ సవరణ బిల్తో పాటు సభలో ఒక తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుడ్గా జంగం సామాజిక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల జాబితాలో తిరిగి చేర్చాల్సిందిగా తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్రానికి విఙప్తి చేస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. మహిళా సాధికారత- రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ, సమగ్ర భూ సర్వే, చుక్కల భూముల్లో సంస్కరణలు అసెంబ్లీ స్వల్పకాలిక చర్చలు జరుగనున్నాయి.
ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి, సంఘ సేవకురాలిగా సుధామూర్తికి చాలా మంచి గుర్తింపు ఉంది. అంత ఆస్తి ఉండి కూడా సింపుల్ గా ఉండే ఆమె తీరుకు అందరూ ఫిదా అయిపోతూ ఉంటారు. అంతేకాదు ఆమె మంచి ఇన్ ఫ్లూయన్సర్ కూడా. తన మాటలతో ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఆమె ఎక్కడైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే అక్కడికి వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే దీనినే కొంతమంది ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. సుధామూర్తి వివిధ కార్యక్రమాలకు హాజరు అవుతానని చెప్పకపోయినా ఆమె వస్తుందంటూ డబ్బులు వసూలుల చేశారు. ఈ విషయం తెలుసుకున్న సుధామూర్తి పోలీసులను ఆశ్రయించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తన పేరు దుర్వినియోగ పరుస్తున్నారంటూ కంప్లైట్ ఇచ్చారు.
మూసీ నదిపై 5 కొత్త వంతెనలు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరవాసులకు హెచ్ఎండీఏ శుభవార్త చెప్పింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా.. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఎంఎయుడిఆర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. ఈ వంతెన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. 5 వంతెన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణం త్వరలో సాకారం కానుందని నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మూసీ, ఈసా నదులపై 14 వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రెండేళ్లుగా కరోనా ఎదుర్కొంటున్న పరిస్థితుల కారణంగా మూసీ, ఇసా నదులపై వంతెనల నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది.
ఆసియా క్రీడల్లో భారత్కు బంగారు పతకం!
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ బంగారు పతకంను గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ల త్రయం 1893.7 పాయింట్లు సాధించింది. ఆసియా గేమ్స్ 2023లో భారత్కు ఇదే మొదటి బంగారు పతకం. ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత్కు ఐదు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్లో రజతం, కాంస్యం.. రోయింగ్లో రెండు రజతాలు, ఓ కాంస్యం వచ్చాయి.
షూటింగ్ క్వాలిఫికేషన్ ఫైనల్ రౌండ్లో 1893.7 స్కోర్తో భారత్ అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాతి స్ధానంలో నిలిచిన ఇండోనేషియా (1890.1 స్కోర్) రజతం సొంతం చేసుకుంది. ఇక మూడో స్ధానంలో నిలిచిన చైనా.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. భారత్కు బంగారు పతకం రావడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానిగా ఆయనకు మించిన అభ్యర్థి లేడు: జేడీయూ నేత
ప్రధాని నరేంద్రమోడీని ఈసారి ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో విపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి ఇండియా. ఈ కూటమికి సంబంధించి ప్రధాని అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే అందులో ఉన్న పార్టీల నేతలందరు మాత్రం ఐకమత్యంగా ఉండటం చాలా అవసరమని ఆ మాటపై కట్టుబడి ఉన్నారు. ఇక ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించకపోవడంతో ప్రతి పార్టీకి చెందిన నేతలు తమ నాయకుడే ప్రధాని అభ్యర్థికి సమర్థుడు అంటూ ప్రకటిస్తున్నారు.
తాజాగా ప్రధానిగా తమ పార్టీ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరని ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, జేడీయూ నేత మహేశ్వర్ హజారీ అన్నారు. ప్రధానిగా కావాల్సిన అన్ని లక్షణాలు నితీశ్ కుమార్లో ఉన్నాయని ఆయన కొనియాడారు. ఇండియా కూటమి ఎప్పుడు ప్రధాని పేరును ప్రకటిస్తుందో తనకు తెలియదని కానీ అలా ప్రకటిస్తే అది కచ్ఛితంగా నితీశ్ కుమార్ పేరే అయి ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును త్వరలోనే ఇండియా కూటమి ప్రకటిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్ గణేషుని వద్దకు పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన క్యూలైన్లు
జై బోలో గణేష్ మహరాజ్ కీ జై.. గణపతి బప్పా మోరియా.. నినాదాలతో ఖైరతాబాద్ పరిసరాలు మారుమోగాయి. ఆదివారం సెలవు దినం కావడంతో గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భారీ క్యూలు కనిపించాయి. లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని ఉత్సవ కమిటీ తెలిపింది. మరోవైపు ఇంటి గణపతులు సముద్ర తీరం వైపు అడుగులు వేస్తుంటే నగరమంతా బొజ్జ గణపయ్యల సందడితో మారుమోగింది. హుస్సేన్ సాగర్లో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు శివారు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుండటంతో ట్యాంక్బండ్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. నిమజ్జనం సజావుగా సాగేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
నేడు బెజవాడ రానున్న తెలంగాణ గవర్నర్ తమిళసై
నేడు విజయవాడలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ దీనోపాద్యాయ పుస్తక ఆవిష్కరణ లో తమిళ సై పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30కి వచ్చి రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్కు తిరుగుప్రయాణం కానున్నారు. ఇదిలా ఉంటే.. ‘చాన్స్లర్ కనెక్ట్స్ అల్యూమినీ’ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ తమిళిసై సోమవారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధికారులు, ప్రముఖ విద్యావేత్తలతో సమావేశమవుతారు. రాజ్భవన్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 9.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలపై గవర్నర్ వర్సిటీ అధికారులతో చర్చించనున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు
రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని వెల్లడించింది. హైదరాబాద్తో సహా మొత్తం రాష్ట్రం సెప్టెంబర్ చివరి వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని, అక్టోబర్ ప్రారంభంలో వాతావరణం క్రమంగా మారుతుందని చెప్పింది. సోమవారం, మంగళవారాల్లో వివిధ జిల్లాల్లో నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
