NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి వారాహి ఉత్సవాలు, సారె మహోత్సవాలు..
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో.. నేటి నుంచి రెండు ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.. నేటి నుంచి దుర్గగుడిపై వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు అంటే.. 9 రోజుల పాటు నవరాత్రులు నిర్వహించనున్నట్టు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు ఇప్పటికే వెల్లడించారు.. అయితే.. ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.. మరోవైపు.. నేటి నుంచి దుర్గగుడిలో ఆషాఢం సారె మహోత్సవాలు నిర్వహించబోతున్నారు.. ఆలయంలోని ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాట్లు చేశారు.. సారె ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆ తరువాత శాఖంబరీ ఉత్సవాలకు కావాల్సిన కూరగాయలు భక్తులు సమర్పించడానికి ముందుకు వస్తున్నారు.. జులై 19, 20వ తేదీలలో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు కొనసాగనున్నాయి.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆషాఢ సారె మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది.. కదంబం ప్రసాదంగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈవో రామారావు వెల్లడించారు.

మరోసారి ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి కడప జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేటి నుంచి కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు జగన్.. తన పర్యటనలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనననున్నారు.. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నాయి వైసీపీ శ్రేణులు.. ఈ నేపథ్యంలో.. ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న జగన్.. ఉదయం 11.40కి విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు.. మధ్యాహ్నం 12.25కి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలోని భాకరాపురంలో గల తన స్వగృహానికి చేరుకుంటారు వైఎస్‌ జగన్‌.. ఈ మూడు రోజుల పాటు పులివెందుల, ఇడుపులపాయలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.

జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..
జ్యేష్ఠ మాసంలో అమావాస్య నాడు వచ్చే పాడ్యమి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జులై 07 ఆదివారం నాడు గోల్కొండలో బోనాలు ప్రారంభమై ఆగస్టు 04 ఆదివారంతో ముగుస్తుంది.. కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో ప్రతి నెలా బోనాలు నిర్వహిస్తారు. ఇలా చేస్తే అమ్మవారి కరుణ ఏడాది పొడవునా ఉంటుందని భక్తుల విశ్వాసం. జూలై 7న గోల్గొండ జగదాంబ అమ్మవారితో బోనాలు ప్రారంభమై ఆగస్టు 4న సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి మహంకాళి జాతరతో ముగుస్తుంది. లాల్ దర్వాజ తదితర ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బోనం అంటే భోజనం అని అర్థం. ప్రకృతి ఇచ్చిన దానిని నైవేద్యంగా మార్చి అమ్మవారికి సమర్పించడమే బోనం. అంతా సిద్ధమైన తర్వాత బోనం కుంటను తలపై ఉంచి డప్పుల మోత నడుమ అమ్మవారికి సమర్పిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరికీ మంచి ఆరోగ్యం చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కొందరు అమ్మవారికి బోనంతో పాటు సాక సమర్పిస్తారు. ఒక చిన్న మట్టి పాత్రలో నీరు పోసి చక్కెర మరియు బెల్లం కలిపి పానీయం తయారుచేయాలి. బోనాల పండుగ ఊరేగింపులో పోతురాజు, శివసత్తుల విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

తెలంగాణ సెట్‌ 2024 దరఖాస్తు గడువు జులై 8వరకు పొడిగింపు..
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఉస్మానియా విశ్వవిద్యాలయం పొడిగించింది. తాజాగా దరఖాస్తు గడువును జూలై 8 వరకు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1500 ఆలస్య రుసుముతో జూలై 16 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో జూలై 26 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో ఆగస్టు 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక ఆగస్టు 8, 9 తేదీల్లో దరఖాస్తు సవరణకు అవకాశం ఉంటుందని.. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో సెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. దీనికి సంబంధించి 2024 ఆగస్టు 20 నుంచి హాల్ టిక్కెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టులలో నిర్వహించబడుతుంది. MA, MSc, MCom, MBA, MLISC, MED, MPED, MCJ, LLM, MCA, MTech (CSE, ITలో ఏదైనా ఒకదానిలో PG డిగ్రీలో కనీసం 55% మార్కులతో తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG SET)-2024కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ) సంబంధిత అంశంలో. ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి లేదు. ఈ సీబీటీ పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు సమయం ఉంటుంది.

ఇవాళ ఎఫ్‌ఎం‌జీఈ అర్హత పరీక్ష.. క్వశ్చన్ పేపర్పై కీలక ప్రకటన
ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (FMGE).. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన స్టూడెంట్స్ భారత్‌లో సేవలు అందించేందుకు ఈ అర్హత పరీక్షను తప్పకుండా రాయాల్సి ఉంటుంది. దీన్ని ఈ రోజు ( శనివారం ) దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 71 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబోతున్నారు. నగదు చెల్లిస్తే ఎఫ్ఎంజీఈ ప్రశ్నాపత్రం అందిస్తామంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ) తీవ్రంగా రియాక్ట్ అయింది. అవన్నీ మోసపూరిత ప్రకటనలే అని ఎన్‌బీఈ క్లారిటీ ఇచ్చింది. క్వశ్చన్ పేపర్ ఇంకా తయారీ దశలోనే ఉందని పేర్కొనింది. ప్రశ్నాపత్రాలపై ఈ తరహా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌బీఈ చెప్పుకొచ్చింది. ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే కేరళలో ఓ కేసు నమోదు అయిందని ఎన్‌బీఈ వెల్లడించింది. ఈలాంటి తప్పుడు న్యూస్ వైనల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాని పోలీసులు సైతం పేర్కొన్నారు.

రిషి సునాక్ భార్య డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్.. కారణమేంటంటే?
బ్రిటిష్ పార్లమెంటరీ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) ఘోర పరాజయంతో అధికారానికి దూరమైంది. కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లు మాత్రమే సాధించింది, ఇది 2019లో గత ఎన్నికల కంటే 250 సీట్లు తక్కువ. పరాజయం తర్వాత భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ప్రధాన మంత్రిగా తన చివరి ప్రసంగాన్ని ఇచ్చారు. ఓటమికి బాధ్యత వహిస్తూ ఓటర్లకు, కన్జర్వేటివ్ పార్టీ నేతలకు సునాక్ క్షమాపణరు చెప్పారు. అయితే ఈ సమయంలో భారతీయ బ్రాండ్ దుస్తులు ధరించి తన భర్త కోసం వేచి ఉన్న ఆయన సతీమణి అక్షతా మూర్తి వెనక నిలబడి ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం అక్షతామూర్తి ధరించిన డ్రెస్‌పై చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్షతామూర్తి డ్రెస్‌పై సోషల్ మీడియాలో చర్చ జరగుతోంది. ఈ హై నెక్ డ్రెస్‌లో బ్రిటీష్ జాతీయ జెండా (నీలం, ఎరుపు, తెలుపు) యొక్క అన్ని రంగుల చారలు ఉన్నాయి. దీని కారణంగా ఈ డ్రెస్‌పై సోషల్ మీడియాలో హేళన చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో ఇంత ఫన్నీ ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు, దీనికి కారణం డ్రెస్ డిజైన్. అక్షత దుస్తులపై బాణాలు క్రిందికి వెళ్తున్నాయి, ఆ డ్రెస్ అడుగు భాగం ఎర్రగా ఉంది. ఇంటర్నెట్ వినియోగదారులు ఈ డిజైన్‌ను కన్జర్వేటివ్ పార్టీకి 2024 ఎన్నికల ఫలితాల చిహ్నంగా వర్ణించడం ప్రారంభించారు. మరొక నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు. రిషి సునాక్‌ రాజీనామా చేయడంలో సహాయం చేయడానికి అక్షతా మూర్తి అమెరికన్ ఫ్లాగ్ స్టైల్ దుస్తులను ధరించడం చూడటం ఆనందంగా ఉంది. అనుకున్న ప్రకారం, అమెరికాలో కొత్త జీవితం కోసం ప్రైవేట్ జెట్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని రాశాడు.

విరాట్ కోహ్లీ మొబైల్ వాల్‌పేప‌ర్‌గా ఆయన ఫోటో.. ఎవ‌రీయ‌న‌?
ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఓపెనర్ టాప్ బస్‌లో భారత క్రికెటర్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వాంఖడే స్టేడియంలో క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఫోన్ వాల్‌పేపర్‌పై ఓ ఫోటో కెమెరా కంటికి చిక్కింది. ఇది తన సతీమణి అనుష్క దే కదా అనుకుంటే పొరపాటేనండోయ్. ఆ వాల్‌పేపర్‌పై వున్నది నీమ్ కరోలి బాబా ఫోటో. ఇంతకీ.. నీమ్ కరోలి బాబా ఎవరు? విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్ వాల్‌పేపర్‌గా అతని చిత్రం ఉంటే, ఆ బాబా చాలా శక్తివంతమైనవారు అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. నీమ్ కరోలి బాబాను నీబ్ కరోరి బాబా అని కూడా అంటారు. కరోలి బాబా అసలు పేరు లక్ష్మణ్ దాస్. 1958లో లక్ష్మణ్ దాస్ తన సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ సమయంలో టిక్కెట్టు లేకుండా రైలులో ప్రయాణిస్తుండడంతో కరోలి గ్రామ సమీపంలో టీటీ అతన్ని రైలు నుండి దింపేసింది. ఆ తర్వాత రైలు ముందుకు కదలదు. దీంతో సాధువును రైలు నుంచి దింపినందున రైలు కదలకపోవడంతో బాబాను ఎక్కించుకోవాలని ప్రయాణికులు సూచించడంతో టీటీ మళ్లీ రైలు ఎక్కించారు. అయితే.. రెండు షరతులతో బాబా మళ్లీ రైలు ఎక్కనున్నారు.

రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు… కల్కి కలెక్షన్స్ ఎంతంటే ..?
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం కల్కి2898AD. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ రికార్డు కలెక్షన్స్ రాబడుతోందీ. వైజయంతి బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా భారీబడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. కాగా కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అల్ టైమ్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. నైజాంలో ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నైజాం నయానవాబ్ గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 242కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అటు తమిళంలో రూ. 24 కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్ మార్కెట్ నుండి రూ. 164 కోట్లు రాబట్టింది. మలయాళంలో రూ .15 కోట్లు వసూలు చేయగా, కన్నడ ఇండస్ట్రీలో రూ. 25 కోట్లు రాబట్టి ప్రభాస్ గత చిత్ర తాలూకు చిత్రాల రికార్డులు బద్దలు కొట్టింది. ఓవర్సీస్ లో $14.5M గ్రాస్ తో ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. మొత్తంగా 8 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ. 363.09 కోట్ల షేర్, రూ.750 కోట్ల గ్రాస్ రాబట్టి సక్సెఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ఈ కలెక్షన్లతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ సాధించి, క్లీన్ హిట్ సాధించే దిశగా పరుగులు తీస్తోంది కల్కి. నేడు, రేపు సెలవులు కావడంతో బాక్సఫీస్ దగ్గర పెద్ద నంబర్ కనిపించే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత సరైన సినిమాలు లేక బోసిపోసిన థియేటర్లకు కల్కిరూపంలో భారీ ఊరట లభించింది. ఇక, కల్కి చిత్రం సూపర్ హిట్ తో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషిగా ఉన్నారు. కల్కి – 2 ఎప్పుడు వస్తుందా? అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కల్కి -2 ఇప్పటివరకు 30 శాతం మాత్రమే షూటింగ్ పూర్తిచేశామని మిగిలిన భాగం అతి త్వరలో మొదలుపెట్టి 2025 నాటికి విడుదల చేస్తామని నిర్మాత అశ్వనీదత్ ఇంటర్వూలో వెల్లడించారు.

వారి వల్ల ఉద్వేగానికి లోనయ్యాను.. ఏఆర్ రెహమాన్..
జూన్ 29వ తేదీన చరిత్ర పుటల్లో భారత్ చోటును సంపాదించుకుంది. టీమిండియా క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. 17 ఏళ్ల తర్వాత మరోసారి టి20 ప్రపంచ కప్ ముద్దాడింది. ఇక కప్ గెలిచాక జూలై 4న ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చిన టీమిండియా కు విశేష అభిమానుల సంద్రోహంతో ఘన స్వాగతం లభించింది. టీమ్ మొత్తం ఓపెన్ టాప్ బస్సు మీద ముంబై రోడ్ల వెంబడి వాంఖడే మైదానానికి చేరుకున్నారు. అక్కడ లక్షలాది మంది అభిమానులు వారి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా అభిమానులు కూడా టీమ్ మొత్తానికి ముక్తకంఠంతో స్వాగతం పలికి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పునస్కరించుకొని తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తాను భావోద్వేగానికి లోనైనట్లుగా తాను చేసిన పోస్టు ద్వారా వివరించాడు. ముంబైలోని వాంఖడే మైదానానికి టీం ఇండియా చేరినప్పుడు.. అక్కడ వందేమాతరం పాటను ప్లే చేయగా విరాట్ కోహ్లీ తోపాటు టీం సభ్యులు, అలాగే స్టేడియంలోని మొత్తం ప్రజలందరూ వందేమాతరం పాటను ఒక్కసారిగా పెద్దగా పాడడంతో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారని తెలిపారు. అయితే తాను పాడిన పాటను ఇలా అందరూ స్వరపరచడం తనకు ఎంతో భావోద్వేగాన్ని గురిచేసిందని తెలిపారు. తను ఈ పాటను 1997లో స్వరపరిచినట్లు తెలుపుతూ.. ఈ పాటను తాను ఎప్పుడూ విన్నా కానీ భావోద్వేగానికి గురవుతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ పాట కంపోజ్ చేసి 27 సంవత్సరాలు గడుస్తున్నా కానీ జాతీయ గీతం సంబంధించిన పాట కాబట్టి.. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.