Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పెద్దపులి కలకలం.. అక్కడ ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు సెలవు ప్రకటన..
రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు ప్రాంతంలో పెద్దపులి కలకలం సృష్టించింది. తొర్రేడు హైస్కూల్ సమీపంలోని అరటి తోటలో పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనావాసాలకు అతి సమీపంలో అరటి తోటల్లో పులి సంచరిస్తుండటంతో గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పులి సీతానగరం మండలం రాపాక గ్రామం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ 15 ట్రాప్ కెమెరాలు, రెండు బోనులు ఏర్పాటు చేసి, డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టింది. పులి సంచరించే అవకాశం ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ సిబ్బంది ద్వారా ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి భయంతో గ్రామస్తులు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. పెద్దపులి సంచరణ నేపథ్యంలో సీతానగరం, కోరుకొండ, రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈవేళ ఒకరోజు సెలవు ప్రకటించారు. పులి సంచరించే అవకాశం ఉన్న మార్గాల పరిధిలో ముందస్తు భద్రత చర్యలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈవేళ నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఐ. శారద తెలిపారు.

జోగి రమేష్‌పై కేసు నమోదు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..!
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. లోకేష్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జోగి రమేష్‌పై చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం రావడంతో, ఆయన్ను అరెస్ట్ చేయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కారణంతో ఆయన ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై కూడా పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనలో టీడీపీ శ్రేణుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. జోగి వ్యాఖ్యలు, ఆయన ఇంటిపై దాడి ఘటన.. ఈ రెండు అంశాలపై వేర్వేరు కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి తిరుపతి నుంచి విజయవాడకు వచ్చిన జోగి రమేష్, పరామర్శ నిమిత్తం వచ్చిన నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగమోహన్ రావుతో కలిసి రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో తన నివాసం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు ఆయన తనయుడు రాజీవ్ కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారి తీస్తోంది.

‘సర్’పై నేడు ఈసీని కలవనున్న సీఎం మమత
ఢిల్లీ వేదికగా ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పోరాటానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. ‘‘సర్’’కు వ్యతిరేకంగా హస్తినలో తృణమూల్ కాంగ్రెస్ ఫైట్ చేయబోతుంది. త్వరలో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే (SIR) చేపట్టింది. అనంతరం లక్షలాది ఓట్లను తొలగించింది. దీంతో ఈసీకి వ్యతిరేకంగా మమత గళం విప్పారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే సీఎం మమతకు ఇవాళ ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఇందుకోసం ఆమె ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆమె ఎన్నికల సంఘాన్ని కలిసి ‘‘సర్’’పై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే సుప్రీంకోర్టులో జరిగే విచారణకు కూడా ఆమె హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ వేదికగా టీఎంసీ నాయకులు పోరాటానికి రెడీ అవుతున్నట్లు కూడా కనిపిస్తోంది. అటు పార్లమెంట్‌లోనూ… ఇటూ పబ్లిక్‌గానూ నిరసనలు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. PSLపై నిషేధం, ఆర్థిక ఆంక్షలతో పాకిస్థాన్ వాట్ నెక్ట్స్?
భారత్‌తో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డిసిషన్ తీవ్ర పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తోంది. ఈ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షల విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. అత్యంత తీవ్ర చర్యగా, పాకిస్తాన్‌ను రాబోయే టీ20 వరల్డ్‌కప్ నుంచే పూర్తిగా నిషేధించే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో భారత్‌తో జరగాల్సిన గ్రూప్ లీగ్ మ్యాచ్‌ను ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయించింది. బంగ్లాదేశ్‌ను టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పించడానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీసీబీ వెల్లడించింది. అయితే, తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేందుకు పీసీబీ ఇప్పటికే ఐసీసీ, బీసీసీఐలతో బైండింగ్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ఒప్పంద ఉల్లంఘనగా ఐసీసీ భావిస్తోంది. కాగా, ఈ అంశంపై డిసిషన్ తీసుకునేందుకు ఐసీసీ బోర్డు ఈరోజు ( ఫిబ్రవరి 2న) వర్చువల్ సమావేశం కానుంది. పాకిస్తాన్‌ను టోర్నీలో కొనసాగించాలా లేదా నిషేధించాలా అనే కీలక అంశంపై ఈ భేటీలో చర్చ జరగనుంది. ఒకవేళ టోర్నీలో ఆడేందుకు అనుమతించినా, పాకిస్తాన్‌కు కఠినమైన ఆంక్షలు తప్పవని ఐసీసీ వర్గాలు స్పష్టం చేశాయి.

భారత్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని పాక్‌ నిర్ణయం.. ఎవరికి ప్లస్..? ఎవరికి మైనస్..?
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడే మ్యాచ్‌లపై పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.. భారత్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయం గ్రూప్ A అర్హత సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఒక వైపు భారత్‌కు లాభం చేకూరుతుండగా, మరోవైపు పాకిస్తాన్‌కు ఇది ఘోరమైన దెబ్బగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ మైదానంలోకి దిగకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్‌కు వాక్‌ఓవర్ ద్వారా పూర్తి రెండు పాయింట్లు లభిస్తాయి. పాకిస్తాన్‌కు మాత్రం నేరుగా సున్నా పాయింట్లు ఖాతాలో పడతాయి. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మరింత బలపడనుండగా, పాకిస్తాన్ పరిస్థితి కఠినంగా మారనుంది. ఈ నిర్ణయ ప్రభావం కేవలం పాయింట్ల వరకే పరిమితం కాదు. నెట్ రన్ రేట్ (NRR)పై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. ఐసీసీ ఆట నియమాల ప్రకారం మ్యాచ్‌ను ఆడకపోతే, డిఫాల్ట్ అయిన జట్టు నెట్ రన్ రేట్ దెబ్బతింటుంది. భవిష్యత్తులో అర్హత నిర్ణయంలో NRR కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో, పాకిస్తాన్‌కు ఇది మరో పెద్ద సమస్యగా మారుతుంది. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యునైటెడ్ స్టేట్స్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి తొలి రెండు జట్లు సూపర్ 8 దశకు అర్హత సాధిస్తాయి. భారత్‌కు భారత్–పాక్ మ్యాచ్ ద్వారా రెండు పాయింట్లు లభిస్తే, మిగిలిన మ్యాచ్‌లను పెద్దగా ఒత్తిడి లేకుండా ఆడే అవకాశముంటుంది. నెట్ రన్ రేట్ మెరుగుపరచడంపై టీమ్ ఇండియా దృష్టి పెట్టగలదు. అయితే పాకిస్తాన్‌కు మాత్రం ప్రతి మ్యాచ్ డూ-ఆర్-డైగా మారనుంది. భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం వల్ల సంభావ్య పాయింట్లను కోల్పోయిన పాకిస్తాన్, మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పనిసరిగా మంచి ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్, నమీబియాతో జరిగే మ్యాచ్‌ల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఈ మూడు మ్యాచ్‌లలో పాకిస్తాన్ అన్నింటినీ గెలిస్తేనే సూపర్ 8 ఆశలు నిలుస్తాయి. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిస్తే, అర్హత నెట్ రన్ రేట్‌తో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం వల్ల ఇప్పటికే నెట్ రన్ రేట్ దెబ్బతిన్న పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. ఒక మ్యాచ్ లేదా అంతకంటే తక్కువ గెలిస్తే, టోర్నమెంట్ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించే ప్రమాదం ఉంది.

నాగ్ కోసం కథ రెడీ చేస్తున్న హిట్ దర్శకుడు
టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున మరియు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా, నాగార్జున కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘బంగార్రాజు’ కూడా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇమేజ్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. నాగార్జున సినిమాల్లో ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు స్టైలిష్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపి ఈ స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్టోరీ లైన్ నాగార్జునకు కూడా నచ్చడంతో, పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయమని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫినిష్ చేసి కళ్యాణ్ కృష్ణ సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం లైన్ మాత్రమే చెప్పాడట కళ్యాణ్ కృష్ణ. పాయింట్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అటు నాగ చైతన్యకు కూడా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో సూపర్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు కింగ్ నాగార్జున కు హ్యాట్రిక్ విజయాన్ని  ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడట. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి హ్యాట్రిక్ కాంబో ఎలాంటి స్టోరీతో వస్తారో చూడాలి.

మెగా 158కి ‘జన నాయగన్’ దెబ్బ..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సుమారు రూ. 300 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, ఆయన తన తదుపరి చిత్రం ‘మెగా 158’పై దృష్టి పెట్టారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి హీరోయిన్‌గా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించబోతున్నారు. అలాగే చిరంజీవి కూతురిగా కృతి శెట్టి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ప్రస్తుతం కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఫిలిం నగర్ టాక్. వారు నిర్మించిన ‘జన నాయగన్’ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం, మరోవైపు యశ్ ‘టాక్సిక్’ సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల.. చిరు సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. అంతే కాదు ప్రస్తుత సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కావాల్సి ఉండగా, నిర్మాణ సంస్థ చిక్కుల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఈ ప్రాజెక్ట్ వేరే నిర్మాణ సంస్థ చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉందట. చూడాలి మరి ఏం జరుగుతుందో..?

రష్మిక – విజయ్ దేవరకొండల పెళ్లి డేట్ ఇదే..
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరి వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరికీ  నిశ్చితార్థం జరిగింది కానీ అధికారకాంగా ప్రకటించేలేదు. ఇప్పుడు పెళ్లి తేదీకి సంబంధించి డేట్ లాక్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషి ఉన్నారు. ఈ క్రేజీ జంట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక  ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుంది. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండాగా ఈ ఫిబ్రవరి 2న అనగా ఈ రోజు పెళ్లి అని ప్రచారం జరిగినప్పటికీ అవి ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. లేటెస్ట్ గా ఫిబ్రవరి 26నే ముహూర్తం ఖరారైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో వివాహం ముగిసిన అనంతరం, హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకుల కోసం ఒక భారీ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకలో విజయ్-రష్మిక జంటగా మెరిసి, అధికారికంగా తమ బంధాన్ని ప్రకటించబోతున్నారట.అయితే, ఇప్పటి వరకు ఈ పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ నేరుగా స్పందించలేదు. కానీ పెళ్లికి సంబందించిన ఏర్పాట్లు మాత్రం చకచక జరుగుతున్నాయి.

Exit mobile version