NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఇన్స్టాగ్రామ్ యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సూసైడ్ నోట్ రాసిన శ్రీహరి .

ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను కూడా ఆమెను ప్రేమించానని.. కానీ తేజస్విని చనిపోయిందని తెలిపాడు. నేను కూడా తనదగ్గరకు వెళుతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. హాజరైన మంత్రి లోకేష్

విద్యాశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి నారా లోకేష్, అధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచే అంశంపై శాఖ పరంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా గత ప్రభుత్వం విద్యావ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో అధికారులు వివరించారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.

ప్రజాదర్బార్‌కు విన్నపాల వెల్లువ.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు 25వ రోజు వినతులు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో జరిగే “ప్రజాదర్బార్” కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్.. సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఇండోర్ పూల్‌గా మారిన ఉస్మానియా యూనివర్సిటీ మెస్

మంగళవారం కురిసిన వర్షానికి ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లోని రీసెర్చ్ స్కాలర్స్ మెస్ సౌకర్యం మరోసారి నీటితో నిండిపోయింది. నేలపై చీలమండల పొడవు నీరు ఉండటంతో విద్యార్థులు ఇండోర్ పూల్‌లో భోజనం చేయవలసి వచ్చింది. నీటితో నిండిన భోజన సదుపాయానికి సంబంధించిన అనేక వీడియోలను రీసెర్చ్ స్కాలర్‌లు ప్రసారం చేశారు. అలాంటి ఒక వీడియోలో, రెయిన్‌కోట్‌ను ధరించిన వారిలో ఒకరితో ఉన్న ఇద్దరు విద్యార్థులు నేల నుండి వర్షపు నీటిని మానవీయంగా ఒక గిన్నెలోకి పోసి, సమస్య యొక్క తీవ్రతను ప్రదర్శిస్తారు.

కోల్‌కతా వైద్యురాలి హత్య కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం.. సీబీఐకి బదిలీ..

దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో కోల్‌కతా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేసింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఛెస్ట్ మెడిసిన్‌లో పీజీ చేస్తున్న 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె మృతదేహం సెమినార్ హాలులో కనుగొనబడింది.

భర్తకి మద్దతుగా వీడియో రిలీజ్ చేసిన వేణుస్వామి భార్య

సమంత -నాగచైతన్య విడాకుల అంశానికి కొనసాగింపుగా నాగచైతన్య శోభిత జాతకం చెప్పానని చెబుతూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం జరగకముందే వేణు స్వామి మీద తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ ఉమెన్ కమిషన్ కి వేణు స్వామి మీద ఫిర్యాదు చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వేణు స్వామి భార్య శ్రీవాణి ఒక వీడియో రిలీజ్ చేసింది. సో కాల్డ్ జర్నలిస్టులు సో కాల్డ్ జర్నలిస్టు సంఘాలు అంటూ మొదలుపెట్టిన ఆమె తాను కూడా ఒక మీడియా వ్యక్తిని అని చెబుతూ తన భర్తను కూడా సోకాల్డ్ జ్యోతిష్యుడు అంటూ పేర్కొంది.

ముగిసిన విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు.. బరిలో ఇద్దరే..!

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్య్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, రేపు (బుధవారం) నామినేషన్లను ఎన్నికల కమిషన్ పరిశీలించనుంది. ఆగష్టు 30వ తేదీన తుది ఎన్నికలు జరుగనున్నాయి.

భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించాలి..

పారిస్ ఒలింపిక్స్ 2024లో దేశ పతాకధారిగా నిలవడం గర్వించదగ్గ విషయమని పిస్టల్ షూటర్ మను భాకర్ అన్నారు. పారిస్‌లో రెండు పతకాలు సాధించిన భారత పిస్టల్ షూటర్ మను భాకర్ ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలపై కన్నేసింది. పతకాలు సాధించేందుకు తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు. భవిష్యత్తులో తాను ఒకే ఒలింపిక్స్‌లో రెండు కంటే ఎక్కువ పతకాలు సాధించగలిగితే అది గొప్ప అని పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తే.. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన చూపించగలం.. తద్వారా భవిష్యత్తులో భారత్‌కు మరిన్ని ఒలింపిక్ పతకాలు సాధించాలని కోరుకుంటున్నానని మను భాకర్ చెప్పారు.

ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలు..

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నేను శాస్త్రవేత్తను కాదు.. కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.. నాకు ఆశ్చర్యం కలిగింది చెప్పుకొచ్చారు. నా జీవితంలో ఏది కోరుకున్నా జరుగుతుందనేది నిరూపితమైంది.. చిన్నప్పటి నుంచి శ్రీహరి కోటకు రావాలని అనుకునేవాడిని.. అది ఇప్పుడు నెరవేరింది.. నేను నెల్లూరులో చదువుకున్నా.. అప్పట్లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు.. దీనిపై పిల్లల్లో శాస్త్రీయంగా ఎంతో ఆసక్తి ఉండేది.. నేను ఎక్కువగా అంతరిక్షం గురించి మా టీచర్లను అడిగేవాడిని.. దీంతో నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్ కు అధ్యక్షుడిని చేశారు అని పవన్ చెప్పుకొచ్చారు. ఎన్నో ఇబ్బందులు పడి ఆర్యభట్ట మోడల్ ను రూపొందించాం.. శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు.. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి బడ్జెట్ తక్కువగా ఉంది.. వేదాల్లో కూడా సైన్స్ చాలా ఉంది.. చాలా మంది యువకులు ఇసురు నుంచి స్ఫూర్తి పొందుతున్నారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ షాక్

సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెప్పి ఫేమస్ అయిన స్వామి మీద తాజాగా ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది గంటల్లోనే వాళ్లు 2027 వరకే కలిసి ఉంటారని తర్వాత విడిపోతారని అంటూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశాడు. వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడదు అని కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు విడిపోతారు అంటూ చేసిన కామెంట్ల మీద తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు.