NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

భారీ వర్షం.. ఉధృతంగా గాలి వీస్తున్నా.. బుడమేరు గండ్ల పూడిక పనుల్లో నిమ్మల రామానాయుడు

అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా గాలి వీస్తున్నా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో సైతం గట్టుపైనే గడిపారు మంత్రి రామానాయుడు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్‌కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు మంత్రి రామానాయుడు.

ఇండియా-ఎలో 10 మంది టీమిండియా ప్లేయర్స్.. తెలుగోడికి దక్కని చోటు!

ప్రతిష్ఠాత్మక దులీప్‌ ట్రోఫీ 2024 ప్రారంభమైంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో భాగంగా బెంగళూరులోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-బి మధ్య మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇండియా-ఎ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇండియా-బి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ బ్యాటింగ్ చేస్తున్నారు. 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 రన్స్ చేశారు.

ఇండియా-ఎలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కలేదు. మిడిల్ ఆర్డర్‌లో రియాన్ పరాగ్, శివమ్ దూబేలతో పోటీ ఉన్నా.. తుది జట్టులో తిలకే ఉంటాడని అందరూ ఊహించారు. కానీ వారిద్దరే చోటు దక్కగా.. మనోడికి షాక్ తగిలింది. మయాంక్ అగర్వాల్ జతగా శాశ్వత్ రావత్ ఓపెనర్‌గా వస్తదనుకున్నా.. అతడికి అవకాశం దక్కలేదు. కెప్టెన్‌ శుభ్‌మ‌న్ గిల్ ఓపెనర్‌గా ఆడనున్నాడు. స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్ సహా తనుష్ కోటియన్‌ ఆడుతున్నాడు. పేస్ కోటాలో ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు చోటు దక్కింది. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు.

మరోసారి పెరుగుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..

నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి ఒక్కసారిగా పెరగటం ప్రారంభమైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.4 అడుగుల వద్ద ఉన్నది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తుంది. నాలుగు రోజులకు 26 అడుగుల వరకు ఉన్న గోదావరి ఎగువన పెనుగంగా నుంచి వచ్చిన వరద వల్ల గోదావరిలో 20 అడుగులు ఒకేసారి పెరిగింది .దీంతో నిన్న సాయంత్రం 44 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం మళ్లీ గత రాత్రి నుంచి తగ్గటం ప్రారంభించింది. ప్రస్తుతం 43 అడుగుల వద్ద ఉండగా మళ్లీ కొద్దిగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5న గురు పూజా దినోత్సవం జరుపుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తుంటాము. పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. అందుకే వారిని దైవస్వరూపులుగా భావిస్తుంటాం. ఎంతో బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్న గురువులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే వారికి మనం సర్వదా కృతజ్ఞతతో ఉండాలి. ఉపాధ్యాయులను గౌరవించుకోవడమంటే మన సంస్కృతిని మనం గౌరవించుకోవడమే. అందుకే గురుపూజా దినోత్సవం ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా గురువులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు.’ తెలిపారు సీఎం చంద్రబాబు.

వరద ప్రాంతాల్లో శానిటేషన్ పనులను పర్యవేక్షించిన మంత్రి నారాయణ

విజయవాడ వరద ప్రాంతాల్లో శానిటేషన్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షించారు. చీపురు చేత పట్టి పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు నారాయణ. నిర్దేశించిన ప్రాంతాల్లో శానిటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసి యజమానులకు అప్పగించాలని ఆదేశించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వరద ప్రాంతాల్లో మొదటి రోజు ప్రజలను రక్షించేందుకు వెళ్లిన బోట్లు, ట్రాక్టర్లు కూడా బోల్తా పడ్డాయన్నారు. వరద బాధితులందరికీ సరిపడా ఆహారం, తాగునీరు, పాలు, బిస్కట్లు, పండ్లు అందించేలా సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు.

అంబులెన్స్‌లో దారుణం.. పేషెంట్‌ భార్యనే లైంగికంగా వేధించిన డ్రైవర్..!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘాజిపుర్‌లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటనలో అంబులెన్స్‌ డ్రైవరే పేషెంట్‌ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్‌ను తొలగించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ ఆగస్టు 28వ తేదీన ఘాజిపుర్‌లోని ఆరావాళి మార్గ్‌లో ఉన్న ఒక హస్పటల్ లో భర్తను జాయిన్ చేసింది. అక్కడ ఖర్చు తట్టుకోలేక తన భర్తను ఇంటికి తీసుకుపోతానని డాక్టర్లను కోరింది.. దీంతో వారు ఆమెకు ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ నెంబర్‌ ఇచ్చారు. ఇక, సదరు మహిళ అంబులెన్స్‌లో తన భర్తను, సోదరుడిని తీసుకొని సిద్ధార్థనగర్‌లోని ఇంటికి స్టార్ట్ అయింది. ప్రయాణం ప్రారంభించే ముందు ఆ డ్రైవర్‌ ఆమెను తనతో పాటు ముందుసీట్లో కూర్చుంటేనే.. రాత్రి వేళ పోలీసులు మధ్యలో ఆపరని తెలిపాడు. దీంతో ఆమె అలాగే చేయడంతో.. మార్గ మధ్యలో డ్రైవర్‌, అతడి సహాయకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు.. దీనికి సదరు మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వీరి ప్రవర్తనను గమనించిన ఆమె భర్త, సోదరుడు కేకలు వేశారు. దీంతో చవానీ పోలీస్‌స్టేషన్‌ రోడ్డులో వారు అంబులెన్స్‌ను ఆపి ఆమె భర్తను రోడ్డు పక్కనే పడేసి.. ఆక్సిజన్‌ తొలగించి వెళ్లిపోయారు. సదరు మహిళ దగ్గర 10వేల నగదు, కొన్ని ఆభరణాలు లాక్కొని పారిపోయారు. దీంతో ఆ మహిళ, ఆమె సోదరుడు 112, 108 నెంబర్లకు ఫోన్‌ చేసి పరిస్థితి చెప్పడంతో తక్షణమే పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఆమె భర్తను మరో హస్పటల్ కి తరలించారు. కానీ, అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఏడీసీపీ జితేంద్ర దూబే మాట్లాడుతూ.. తాము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్‌

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి తరలిస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగింది. పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించాలన్న తన ఆదేశాలను కొనసాగించేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. అయితే.. హైదరాబాద్‌ మియాపూర్‌లో నందిగం సురేష్‌ అరెస్ట్‌ చేశాయి ఏపీ ప్రత్యేక బృందాలు. విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజా రెడ్డి భర్త శ్రీనివాస్‌ రెడ్డిని సైతం అరెస్ట్‌ చేసిన పోలీసులు మంగళగిరికి తరలిస్తున్నారు.

నేడు ఖైరతాబాద్ మహాగణపతికి నేత్రాలంకరణ..

ఖైరతాబాద్‌లోని 70 అడుగుల ఎత్తైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాన్ని ఇవాళ అలంకరించనున్నారు. శిల్పి చిన్న స్వామి రాజేందర్ నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు 70 అడుగుల విగ్రహాన్ని అన్ని వివరాలతో ఒకటిన్నర రోజుల్లో పూర్తి చేశారు. ఈరోజు (గురువారం) ఉదయం 10 గంటలకు శిల్పి రాజేంద్రన్ స్వామివారికి నేత్రాలంకరణ చేయనున్నారు. విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలను పూర్తిగా తొలగిస్తామని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ తెలిపారు. మరోవైపు ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను స్థానిక ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేందర్ ఆహ్వానించారు. ఇవాళ ప్రజాభవన్ లో పూజారులు, ఉత్సవ మండలి సభ్యులతో కలిసి ఆయన డిప్యూటీ సీఎంను ఆహ్వానించారు. ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా డిప్యూటీ సీఎంను కోరారు.

ఇకపై ఫోన్ కాల్‌తో రైలు టిక్కెట్‌ బుకింగ్.. వాయిస్‌తో చెల్లింపులు..

రైలు ప్రయాణం అనేది ముఖ్యంగా సామాన్యుల ప్రయాణం అని చెప్పవచు. ప్రతిరోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణాలను సులభంగా, సాఫీగా చేయడానికి భారతీయ రైల్వే చొరవ తీసుకుంటుంది. టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ ఇప్పుడు కొత్త అప్డేట్ తీసుకవచ్చింది. ఈ సదుపాయం కింద మీరు బుకింగ్, టిక్కెట్లను రద్దు చేయడం, PNR స్థితిని తనిఖీ చేయడం వంటి పనుల కోసం టైప్ చేయవలసిన అవసరం లేదు. మీరు మాట్లాడటం లేదా కాల్ చేయడం ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ పనులన్నీ రైల్వే వర్చువల్ అసిస్టెంట్ AskDISHA సహాయంతో చేయబడతాయి.

ఊపందుకున్న ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేర్ పనులు

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేర్ పనులు ఊపందుకున్నాయి. బోట్లు గుద్దుకోవడం వల్ల ప్రకాశం బ్యారేజీ గేట్ -.69 డామేజ్ అయ్యింది. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ స్థానంలో వేరే కౌంటర్‌ వెయిట్ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్ ని వెల్డింగ్ చేసి తొలగించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్‌ను తప్పించేందుకు క్రేన్ సిద్ధం చేశారు అధికారులు. నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. మరమ్మతు పనులు బెకెమ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేస్తోంది. బెకెమ్ ఇన్ ఫ్రా ఇప్పటికే.. పోలవరం గేట్లు, పులిచింతల, ప్రాజెక్టుల గేట్లు ఏర్పాటు చేసింది. బ్యారేజీలో ఇరుక్కున్న నాలుగు పడవలను బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ సిబ్బంది తొలగించనున్నారు. తొలుత 67, 69 గేట్లు మూసి ఆ తర్వాత పడవలను తొలగించనున్నారు. ఏడు రోజుల్లో బ్యారేజీ గేట్లు ఏర్పాటు పనులు పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత..

ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు, రేపు సదస్సు జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సదస్సును ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ లో AI రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న నాలుగో నగరంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా  మొదలు కొని ఇప్పుడు AI కి వచ్చామన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోందన్నారు.