NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

కొల్లేరులోకి భారీగా పెరిగిన వరద నీరు.. నీట మునిగిన గ్రామాలు

ఏలూరు జిల్లాలోని కొల్లేరులోకి వరద నీరు భారీగా పెరిగింది. వరద ప్రభావంతో కొవ్వాలంక, పెనుమాకులంక, నందిగామ లంక, మణుగూరు గ్రామాలు నీట మునిగాయి. మునిగిన గ్రామాలకు వెళ్లి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రజల బాగోగులను తెలుసుకుంటున్నారు. కొల్లేరుకు పెరిగిన వరద ఉధృతి కారణంగా ముంపు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పెదపాడు మండలం వసంతవాడ జడ్పీ హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రంలో 60 కుటుంబాలు తలదాచుకుంటున్నాయి. మరింత మంది బాధితులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కొల్లేరు పెరగడంతో కైకలూరు నుంచి ఏలూరు వెళ్లే మార్గాన్ని నిలుపుదల చేశామని కైకలూరు టౌన్ సీఐ కృష్ణ వెల్లడించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, అవసరమైతే గాని ప్రజలు బయటకు రావద్దని ఇంటి వద్ద ఉండాలని సీఐ ప్రజలకు సూచించారు. బుడమేరు తీసుకువస్తున్న వరద కొల్లేరు పరివాహక ప్రాంతాలలో కల్లోలం సృష్టిస్తోంది. లంక గ్రామాలతో పాటు పరివాహక ప్రాంతాల రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరదకు తోడు భారీ వర్షాలు కురుస్తుండడం లంకవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొల్లేరులో నీటిమట్టం పెరగడంతో పెదపాడు మండలం కడిమికుంట పరిసర గ్రామాల్లో వరద నీరు చేరింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పంట పొలాలు చేపల చెరువులను కొల్లేరుకు వచ్చిన వరద ముంచెత్తుతోంది. ఇప్పటికి ఇళ్లను ముంచెత్తడంతో బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొల్లేరు ప్రాంత రాసుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. ఓవైపు బుడమేరు, మరోవైపు తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వాగుల నుంచి వరద నీరు కొల్లేరులో చేరడం.. దీనికి వర్షం తోడు కావడంతో ముంపు సమస్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొల్లేరు ముంపు సమస్య ఎక్కువ కావడంతో లోతట్టు ప్రాంత వాసులను పునరవాస కేంద్రాలకు తరలించే పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అయితే చాలామంది తమ ఇళ్ళు, పశువులు ఏమవుతాయనే ఆందోళనతో ముంపు ప్రాంతాల్లోనే ఉండిపోతున్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వరద ముంచుకు రావడంతో ఆయా ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. వృద్ధులు, పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ చూడని విధంగా కొల్లేరు ప్రాంతవాసులు ఆందోళనకు గురవుతున్నారు. కొల్లేరు నీటిమట్టం పెరగడంతో దెందులూరు,ఏలూరు రూరల్, ఉంగుటూరు, ఉండి, కైకలూరు నియోజకవర్గం పరివాహక ప్రాంతాల వాసులకు కష్టాలు తప్పడం లేదు.

 

హైదరాబాద్ లో హైడ్రా దూకుడు.. జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు..
తెలంగాణలో హైడ్రామా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడం సంచలనం రేపుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరి ఇంటిని హైడ్రా వదలడం లేదు. ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేయడం షాకింగ్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ జయభేరి సంస్థకు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని రంగలకుంట చెరువులో జయభేరి సంస్థకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులులో పేర్కొన్నారు. లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని నోటీసులో తెలిపారు. ఫైనాన్షియల్‌ జిల్లాలోని రంగళాల్ కుంట చెరువులోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలను తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే హైడ్రా జారీ చేసిన నోటీసులపై జయభేరి సంస్థ ఇంకా స్పందించలేదు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ హాల్‌ను హైడ్రా కూల్చివేసి దుర్గంచెరువు బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

హైడ్రా అవసరం లేదు.. మేమే కూల్చేస్తాం.. నోటీసులపై మురళీమోహన్..
హైడ్రా అధికారుల నోటీసులపై సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. 33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానన్న మురళీమోహన్.. తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు అంటున్నారని తెలిపారు. అందుకు హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం ఏమీ లేదని.. ఆ షెడ్డును తామే కూలుస్తామని స్పష్టం చేశారు. కాగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (FTL), బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మురళీమోహన్ స్పందించారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ జయభేరి సంస్థకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. హైదరాబాద్‌లోని రంగలకుంట చెరువులో జయభేరి సంస్థకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులులో పేర్కొన్నారు. లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని నోటీసులో తెలిపారు. కాగా.. ఫైనాన్షియల్‌ జిల్లాలోని రంగళాల్ కుంట చెరువులోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలను తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే హైడ్రా జారీ చేసిన నోటీసులపై జయభేరి సంస్థ ఇంకా స్పందించలేదు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ హాల్‌ను హైడ్రా కూల్చివేసి దుర్గంచెరువు బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

 

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా..
హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ టీమ్‌లు కొనసాగిస్తున్నాయి. మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ను కూల్చివేస్తున్నారు. మల్లంపేట కత్వా చెరువు, దుండిగల్‌లోని అనధికారిక విల్లాలను కూడా హైడ్రా కూల్చివేస్తోంది. ఎఫ్‌టిఎల్‌లోని మూడు నిర్మాణాలను, బఫర్ జోన్‌లోని 5 విల్లాలను హైడ్రా కూల్చివేస్తోంది. గత సోమవారం కత్వ చెరువులో లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీ అక్రమంగా నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు పరిశీలించారు. సున్నం చెరువు మొత్తం వైశాల్యం 26 ఎకరాలు. చెరువులోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిలో భారీ షెడ్లు, భవనాలు ఉన్నాయి. హైడ్రా అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌లో సర్వే నంబర్లు 12, 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి అక్రమార్కులు వ్యాపారాలు సాగిస్తున్నారు. భారీ నిర్మాణాల మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా సరస్సులోని 170/13.4,5 సర్వే నంబర్లలోని 8 విల్లాలను హైడ్రా అధికారులు ధ్వంసం చేశారు. అలాగే మల్లంపేట కత్వ చెరువు ఎఫ్ టీఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు. ఇక్కడ, లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ 2020-21 సంవత్సరానికి 320 విల్లాలను నిర్మించింది. కానీ 60 విల్లాలకు మాత్రమే హెచ్‌ఎండీ అనుమతి తీసుకున్నారు. మరికొన్ని ఫోర్జరీ సంతకాలతో నిర్మించారని ఆరోపించారు. మేడ్చల్ కలెక్టర్ హరీశ్ నేతృత్వంలో డీపీఓ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి 208 విల్లాలను సీజ్ చేసి వాటికి అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. వీటికి కరెంట్ కనెక్షన్, నీటి కనెక్షన్, రిజిస్ట్రేషన్, బ్యాంకు అధికారుల నుంచి రుణాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆర్డినెన్స్ ఇచ్చింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా అధికారులు మరో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు. రెండేళ్ల క్రితం కూల్చివేసిన మున్సిపల్ అధికారులు.. మళ్ళీ యజమాని నిర్మాణం చేపట్టారు. అనుమతులు లేకుండానే G+2 నిర్మాణం చేపట్టడంతో హైడ్రా అధికారులు ఎంట్రీ ఇచ్చారు. కూల్చివేసిన మళ్లీ నిర్మాణం చేపట్టారని కూల్చివేశారు అధికారులు. ఇక మరోవైపు షబ్బీర్ భాయ్ బిర్యానీ వాలా హోటల్ ను కూల్చివేస్తున్నారు. దీంతో హోటల్ యజమాని అడ్డుకున్నారు. ఇది అక్రమ నిర్మాణమని అందుకే కూల్చేస్తున్నట్లు తెలిపారు. దీంతో భారీగా స్థానికులు మోహరించడంతో పోలీసులు చెదరగొడుతున్నారు.

 

రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం మాస్కోకు వెళ్లనున్న అజిత్ దోవల్.?
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని పరిష్కరించేందుకు అనుకున్న విధంగా శాంతి ప్రయత్నాలపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ ఈ వారం రష్యాకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం.. వారు పోరాడుతున్న దేశాలను సందర్శించి, వారి నేతలను కలిసిన వారాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ కాల్ సమయంలో పిఎం మోడీ తన కైవ్ పర్యటన గురించి పుతిన్‌కు తెలియజేశారు. ఇంకా ఉక్రెయిన్‌కు రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారాన్ని తీసుకురావడానికి తన నిబద్ధతను నొక్కి చెప్పారు. ఇటీవల వ్లాడివోస్టాక్‌ లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌ లో, 2022 నుండి ఇస్తాంబుల్ ఒప్పందంపై ఆధారపడి ఈ చర్చలు జరగాలనే షరతుపై ఉక్రెయిన్‌తో చర్చలు జరపడానికి పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ కు సంబంధించి భవిష్యత్తులో జరిగే శాంతి చర్చలలో చైనా, భారతదేశం, బ్రెజిల్‌లను సంభావ్య మధ్యవర్తులుగా కూడా ఆయన ప్రతిపాదించారు. అయితే., దోవల్ రష్యా పర్యటన ఖచ్చితమైన సమయం ఇంకా ధృవీకరించబడలేదు. అయితే., ఇది వివాదానికి పరిష్కారం కోరడంలో భారతదేశ చురుకైన నిశ్చితార్థాన్ని తెలపబడుతుంది.

 

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూసారా.. ట్రైలర్ రిలీజ్
2019 లో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం మత్తు వదలార. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత దానికి సీక్వెల్ గా వస్తుంది మత్తు వదలారా 2 . రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహ కోడూరి, సత్య జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ నుంచి టీజర్‌ నుంచి ప్రమోషనల్‌ సాంగ్‌ వరకు ప్రతి ప్రమోషన్‌ మెటీరియల్‌లో డిఫ్రెంట్ గా ప్లాన్ చేసాడు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసారు. హెచ్‌ఈ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్లుగా పనిచేస్తున్న శ్రీ సింహ మరియు సత్య, వారు పట్టుకున్న కిడ్నాపర్‌ల నుండి డబ్బును గుంజుతు, అనుకోకుండా ఒకరిని హత్య చేస్తారు. దాంతో ఓ ప్రత్యేక బృందం వారిని కోల్డ్ బ్లడెడ్ హంతకులుగా పరిగణిస్తూ పట్టుకోవాలి చూస్తుంటారు. దర్శకుడు రితేష్ రానా సీక్వెల్ కోసం మరొక అద్భుతమైన నేపథ్యాన్ని ఎంచుకున్నాడు, ప్రతి పాత్ర ఒక ముఖ్యమైన పాత్ర పోషించేలా వేగవంతమైన స్క్రీన్ ప్లే తో షాట్ పంచులతో అలరించాడు. లాస్ట్ లో వచ్చిన అల్లుడు డైలాగ్ ట్రైలర్ కె హైలెట్. శ్రీ సింహ కోడూరి మరియు సత్య పాత్రలు అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉండేలా డిజైన్ చేసారు. ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్ రోహిణి, ఝాన్సీ కీలక పాత్రల్లో కనిపించారు. సెప్టెంబరు 13న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.

 

ఆత్మారావుగా ‘కంట్రీ డిలైట్’ యాడ్ లో అదరగొట్టిన ‘మెగాస్టార్ చిరంజీవి’
వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు మెగాస్టార్. ఒకపక్క సినిమాలు మరోపక్క యాడ్స్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. చిరు యాడ్స్ లో నటించడం ఇప్పుడు కొత్తేమి కాదు గతంలో థమ్స్ అప్, నవరత్న యాడ్స్ లో కనిపించి ఫ్యాన్స్ ను అలరించారు. తాజాగా ‘కంట్రీ డిలైట్’ అనే మిల్క్ బ్రాండ్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ ను కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. ఈ యాడ్ లో తన మార్క్ నటనతో చిరంజీవి ఈ యాడ్‌లో ఆకట్టుకున్నారు. మెగాస్టార్ యాడ్ కు సంభందించిన తన డైలాగ్ వెర్షన్ ప్రిపేర్ అవుతుండగా కమెడియన్ సత్య షాట్ రెడీ అనగానే చిరంజీవిలో నుంచి గీతల చొక్కా, లుంగీ, కళ్లద్దాలు పెట్టుకున్నా ఆత్మారావు బయటకొచ్చి చెప్పిన డైలాగ్ లు నవ్వులు పూయించాయి. గతంలో చిరు నటించిన అన్నయ్య సినిమాలోని ఆత్మరావు క్యారక్టర్ ను ఈ యాడ్ లో మరోసారి చూపించాడు దర్శకుడు హరీష్ శంకర్. వీరిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ లోనే పాల బ్రాండ్, దాని గొప్పదనం, పాలను బుక్ చేసుకునే విధానాన్ని చక్కగా చూపించారు. చివరి షాట్ లో ఒక్క షాట్ కి రిహార్సల్స్ ఆ, ఊరికినే అయిపోతారా మెగాస్టార్లు అని సత్య చెప్పిన డైలాగ్ యాడ్ కె హైలెట్ గా నిలిచింది. ఈ యాడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ మాస్ కమర్షియల్ యాడ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.

 

భారత్ ఖాతాలో 29 పతకాలు.. పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందంటే..?
పారిస్ పారాలింపిక్స్ 2024 లో శనివారం భారత్ 2 పతకాలు సాధించింది. దింతో భారత జట్టుకు 29కి పతకాల సంఖ్య చేరింది. 200 మీటర్ల టి-12 ఈవెంట్‌లో సిమ్రాన్ తొలి పతకాన్ని సాధించింది. కాంస్య పతకాన్ని సాధించింది. దీని తర్వాత, పురుషుల జావెలిన్ త్రో F-41 ఫైనల్‌లో నవదీప్ సింగ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దింతో భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు సాధించింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. పాయింట్ల పట్టికలో భారత్ 16వ స్థానంలో ఉంది. 216 పతకాలతో చైనా మొదటి స్థానంలో ఉంది. గ్రేట్ బ్రిటన్ 120 పతకాలతో రెండో స్థానంలో ఉంది. అమెరికా 102 పతకాలతో మూడో స్థానంలో ఉంది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలు సాధించింది. అయితే, నవదీప్ చాలా నాటకీయంగా గోల్డ్ మెడల్ సాధించాడు. స్వర్ణ పతకం సాధించిన ఇరాన్ ప్లేయర్ బీత్ సయా సదేగ్ అభ్యంతరకర జెండాను పదే పదే ప్రదర్శించడంతో అనర్హుడిగా ప్రకటించబడ్డాడు. దాంతో అతడికి రావలిసిన గోల్డ్ ను కాస్త రెండో స్థానంలో ఉన్న నవదీప్ కు ఇచ్చారు. ఇకపోతే ఆఖరి మ్యాచ్‌లో నవదీప్ తొలి ప్రయత్నాన్ని ఫౌల్ చేశాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 46.39 మీటర్లు విసిరాడు. దీని తర్వాత, ఈ ఆటగాడి మూడవ ప్రయత్నం 47.32 మీటర్ల దూరంలో ఉంది. సదేగ్ తన ఐదో ప్రయత్నంలో నవదీప్‌ను వెనక్కి నెట్టి 47.64 మీటర్లు విసిరి రికార్డు సృష్టించాడు. నవదీప్ గతంలో టోక్యో పారాలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. గతేడాది హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో కూడా ఈ ఆటగాడు నాలుగో స్థానంలో నిలిచాడు. మరోవైపు., ఫైనల్ మ్యాచ్‌లో సిమ్రాన్ కేవలం 24.75 సెకన్లు పట్టి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సమయంలో అతని గైడ్ అభయ్ సింగ్ కూడా పాల్గొన్నాడు. T-12 వర్గం దృష్టి లోపం ఉన్న రన్నర్‌ల కోసం నిర్వహిస్తారు. ఇందులో ప్లేయర్‌తో పాటు గైడ్ కూడా పాల్గొంటారు. ఈ పతకం ఈ విభాగంలో భారతదేశానికి మొదటిది. పారాలింపిక్స్‌లో ట్రాక్ ఈవెంట్‌లలో మొత్తంగా నాల్గవ పతకం. ఇవన్నీ ప్రస్తుత ఎడిషన్‌లో వచ్చాయి. ప్రీతీ పాల్ తొలి పతకం సాధించింది. ఇక నవదీప్ కోసం, “ఇన్‌క్రెడిబుల్ నవదీప్ పారాలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో F-41 ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతని విజయం అతని అసాధారణ స్ఫూర్తికి ప్రతిబింబం. అతనికి అభినందనలు. భారతదేశం సంతోషంగా ఉంది” అని ప్రధాని రాశారు. అలాగే సిమ్రాన్ కోసం, “మహిళల T12 200m ఈవెంట్‌లో కాంస్యం గెలిచినందుకు సిమ్రాన్ శర్మకు అభినందనలు. ఆమె విజయం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. శ్రేష్ఠత, నైపుణ్యం పట్ల ఆమె నిబద్ధత గొప్పది.” అని మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

 

మొయిన్ అలీ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం.. ఈసారి వెనక్కి తీసుకోనంటూ పోస్ట్!
ఇంగ్లండ్ సీనియర్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్ స్క్వాడ్‌ నుంచి త‌ప్పుకున్న అనంత‌రం ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలీ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుండి రెండుసార్లు రిటైర్ అయ్యి.. తన నిర్ణయాన్ని వెనక్కితీసున్నాడు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలీ.. ఈసారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని చెప్పాడు. ఇప్పటికీ తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, ఇంగ్లండ్ జ‌ట్టులో యువ ఆట‌గాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు మొయిన్ అలీ తెలిపాడు. డైలీ మెయిల్‌లో నాజర్ హుస్సేన్‌తో అలీ మాట్లాడుతూ… ‘అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నా. నేను పట్టుబట్టి మళ్లీ ఇంగ్లండ్‌కు ఆడటానికి ప్రయత్నించగలను. కానీ వాస్తవానికి నేను ఆడనని నాకు తెలుసు. మ‌ళ్లీ నా నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకునే ప్రయ‌త్నం చేయ‌ను. రిటైర్మెంట్ ప్రక‌టించడానికి నా ఫిట్‌నెస్ కార‌ణం కాదు. ఇప్పటికీ నేను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా. ఇంగ్లండ్ జ‌ట్టులో యువ ఆట‌గాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు నేను త‌ప్పుకుంటున్నా. ఇంగ్లండ్ క్రికెట్‌లోకి కొత్తత‌రం ఆట‌గాళ్లు రావాలి’ అని అన్నాడు. ఇంగ్లండ్ త‌ర‌పున 68 టెస్టులు, 138 వ‌న్డేలు, 92 టీ20లు ఆడిన మొయిన్ అలీ.. టెస్టుల్లో 3094, వ‌న్డేల్లో 2355, టీ20ల్లో 1229 ప‌రుగులు చేశాడు. మూడు ఫార్మాట్లు క‌లిపి 366 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తన ఆఫ్ స్పిన్‌తో అలీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టాడు. ఇందులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో మొత్తం 10 సార్లు అవుట్ చేశాడు. ఇంట‌ర్న‌నేష‌న‌ల్ క్రికెట్ నుంచి త‌ప్పుకున్న అలీ.. ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రం ఆడ‌నున్నాడు.