NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

రిటైరయ్యే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇలా రీ ఎంట్రీ..!
రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మళ్లీ వాళ్లు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించేందుకు విధివిధానాలు ఖరారు చేసింది. రిటైరైన ఉద్యగులను మిడిల్ లెవల్ ఆఫీసర్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా రీ అపాయింట్‌మెంట్‌ కోసం విధివిధానాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. గతంలో ఎలాంటి విధి విధానాలు పాటించకుండానే నియామకాలు జరిగాయని జీవోలో వెల్లడించింది.. ఇప్పడు విధివిధానాలు నియామకం కోసం ప్రత్యేక స్క్రీనింగ్‌ కమిటీలునియమిస్తూ జీవో విడుదల చేసిది.. డిప్యూటీ సెక్రటరీ / డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ లో వారిని నియమించాలనుకుంటే దాని కోసం స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఛీఫ్ సెక్రటరీ, పైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సీఎస్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సెక్రటరీ / డిప్యూటీ డైరెక్టర్ అంతకన్నా కింది స్ధాయిలో రిటైర్డ్ ఉద్యోగుల నియామకాలకు జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.. స్క్రీనింగ్ కమిటీ ఆమోదం పొంది ఎవ్వరినైనా రీ అపాయింట్మెంట్ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి అనుమతి పొందాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్.

ఏలూరులో వైసీపీకి బిగ్‌ షాక్.. టీడీపీకి గూటికి మేయర్..
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే మాజీ మంత్రులు కొందరు పార్టీకి గుడ్‌బై చెప్పారు.. మరోవైపు మున్సిపాల్టీ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలపై దృష్టి సారించింది టీడీపీ.. కొన్నింటిని ఇప్పటికే కైవసం చేసుకుంది టీడీపీ.. ఈ నేపథ్యంలో.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏలూరులో బిగ్‌షాక్‌ తగలబోతోంది.. ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఇటీవల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఫలితా లు చవిచూసిన వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే ఏలూరు నగర మున్సిపల్ కార్పొరే షన్ మేయర్ షేక్ నూర్జహాన్.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె తన భర్త పెద బాబుతో కలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.. నేడు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు కూడా.. టీడీపీ గూటికి చేరనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. 2013లో టీడీపీలో చేరి అదే పార్టీ తరపున తొలిసారి మేయర్‌గా ఎన్నికైన షేక్ నూర్జహాన్, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.. ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికి చేరనున్నారు మేయర్ దంపతులు.. ఇప్పటికే ఏలూరు వైసీపీ ఇంఛార్జ్‌ పదవితో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేసిన విషయం విదితమే. మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్న నేపథ్యంలో.. ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ వశం అయ్యే అవకాశాలున్నాయి.

తన అనుచరులకు జేసీ స్వీట్‌ వార్నింగ్.. వదిలిపెట్టను..!
తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. తన అనుచరులకు సీరియస్‌ వార్నిగ్‌ ఇచ్చారు.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణాపై స్పందించిన ఆయన.. నియోజకవర్గంలో 25 మంది ఇసుక రవాణా చేస్తున్నారు.. వారు వెంటనే పద్దతి మార్చుకోవాలి.. ఇసుక తరలింపు నిలిపివేయాలని స్పష్టం చేశారు. గతంలో ఇసుక అక్రమరవాణా అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని గుర్తుచేసుకున్న ఆయన.. నా కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావద్దు అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. మరోవైపు. ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తాం అన్నారు జేసీ.. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టను అని వార్నింగ్‌ ఇచ్చారు.. అక్రమ ఇసుక రవాణాదారులకు ఇదే జేసీ ప్రభాక‌ర్ రెడ్డి చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు.. తాడిపత్రిలో ఇసుక తోలేది 25 మందే.. మీ అందరూ నాకు ఆప్తులు, నాకు ప్రాణాలు ఇచ్చేవారు. కానీ, ఇసుకతో నాకు దూరం కావద్దు అని సూచించారు. నేను కూడా గత ప్రభుత్వ హయాంలో ఎంతో పోగుట్టుకున్నాను.. అలా అని నేను వెళ్లి ఇసుక తోడుకోవడం లేదు కదా? అని ప్రశ్నించారు. అవసరం అయితే మున్సిపాలిటీ ద్వారా ఇసుక రవాణా చేద్దాం.. దాంతో.. మున్సిపాల్టీని మరింత అభివృద్ధి చేద్దామని స్పష్టం చేశారు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి.

ఆక్రమణదారులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్.. స్వచ్ఛందంగా స్వాధీనం చేయండి.. లేదా..?
ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో ఆక్రమణకు గురైన భూములను స్వచ్చందంగా స్వాధీనం చెయ్యాలన్నారు.. లేదంటే ప్రభుత్వం ఆ పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇక, వచ్చే నెలాఖరులోగా టీడీఆర్ బ్లాండ్లపై స్పష్టత వస్తుందని బాధ్యులపై చర్యలు తప్పవన్నారు నారాయణ. మరోవైపు, రుషికొండ భవనాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని, వాటి వినియోగంపై అందరి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. కాపాలుప్పాడ డంపింగ్ యార్డ్ నిర్వహణ , సాలీడ్ వెస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ పనితీరు పరిశీ లించిన మునిసిపల్ శాఖమంత్రి నారాయణ.. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి అన్నారు. గత ఐదేళ్లలో ఒక్క మంత్రి ఈ ప్లాంట్‌ను పరిశీలించలేదు. రెండు నెలలు నుంచి మునిసిపల్ శాఖ ను చూస్తే అస్తవ్యస్తంగా చేశారన్నారు. ఇక, 15 వ ఫైనాన్స్ కమిషన్ కు మాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. వైసీపీ హయాంలో 2023 లో 450 కోట్లు ఇస్తే వాటిని పక్కదారి పట్టించారని విమర్శించారు నారాయణ.. స్వచ్ఛ భారత్ లో 295 కోట్లు రావాలి, మాచింగ్ గ్రాంట్ 120 కోట్లు ఇవ్వలేదు.. మళ్లీ కూటమి ప్రభుత్వంవచ్చాక వాటిని వచ్చేలా చేసినట్టు వివరించారు. టీడీఆర్ కుంభకోణాలు మీద త్వరలో స్పష్టత వస్తుందన్నారు. సెప్టెంబర్ 13 న మరో 75 అన్న కాంటీన్లు ప్రారంభిస్తామని వెల్లడించారు ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ.

కడపలో తారస్థాయికి చెత్త వివాదం.. మేయర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే..! ఉద్రిక్తత
కడపలో చెత్త వివాదం తారస్థాయికి చేరుకుంది.. గత రెండు రోజులుగా కడప ఎమ్మెల్యే మాధవి, కడప మేయర్ సురేష్ బాబుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం.. నేడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమ వీధులలో చెత్త ఎత్తలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెత్తను తీసుకుని వచ్చి మేయర్‌ ఇంటి వద్ద వేసి నిరసనకు దిగారు. దీనికి ప్రతీకారంగా వైసీపీ నేతలు చెత్తను ప్రథమ పౌరుని ఇంటి వద్ద ఎలా వేస్తారు..? అంటూ వాదనకు దిగడంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రంగ ప్రవేశంతో ఇరు వర్గాలను చదరగొట్టారు. ఇక, కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద టీడీపీ నేతల వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు వైసీపీ కార్యకర్తలు… మేయర్ ఇంటి వద్ద చెత్త వేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.. కడప ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. అప్పుడే ఇంటికి చేరుకున్నారు మేయర్ సురేష్ బాబు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చి మూడు నెలలు కాలేదు, అప్పుడే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు.. టీడీపీ నేతలు ఇంటి వద్దకు వచ్చి ఇంత అరాచకం చేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారు..? అని మండిపడ్డారు.. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ క్లాప్స్ ప్రోగ్రాంని ఎత్తివేశారు.. 570 మంది సిబ్బందితో నిత్యం చెత్త ఏరి వేస్తున్నాం అని వెల్లడించారు.. తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పందికొక్కులు మాత్రమే నా ఇంటి వద్ద చెత్తవేశాయి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉన్న కడపను టిడిపి అధికారంలోకి రాగానే అల్లర్లు సృష్టిస్తున్నారు.. నా ఇల్లు పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉంది.. పోలీసులకు తెలియకుండా నా ఇంటి వద్ద చెత్త వేశారా? అని నిలదీశారు.. అంతేకాదు.. మేం అనుకుంటే మీ ఇల్లు వద్ద కూకటి వేళ్లతో తొలగించగలం… కానీ, మా నాయకుని ఆదేశాల మేరకే మేం శాంతియుతంగా ఉన్నాం అన్నారు మేయర్ సురేష్‌ బాబు..

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌..
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్‌ మంజూరైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసులో విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ ఏమవుతుందోనని బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు రెండు కేసుల్లోను కవితకు బెయిల్ రావడంతో అందరూ బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ, సీబీఐ చార్జిషీటు దాఖలు చేశాయి. ఇప్పటికే దీనిపై విచారణ పూర్తయింది. ఈ కేసులో 57 మంది నిందితులు ఉన్నారు. ఢిల్లీలో సంచలనం సృష్టించిన మద్యం కేసులో కవితను మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది. విచారణ అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉన్నారు.

బీసీసీఐ కార్యదర్శి పోస్ట్.. రోహన్ జైట్లీ ఏమన్నారంటే?
ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అందుకోవడం లాంఛనమే. నామినేషన్‌ వేయడానికి నేడు ఆఖరు తేదీ కాగా.. షాకు ఏకంగా 15 మంది (16 మందిలో) మద్దతు ఉంది. ఐసీసీ ఛైర్మన్‌గా షా వెళితే.. బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పదవి రేసులో చాలామంది ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి. ఇందులో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు (డీడీసీఏ) రోహన్‌ జైట్లీ కూడా ఉన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా రోహన్‌ బాధ్యతలను చేపడతారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలను చేపడతానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను రోహన్‌ జైట్లీ ఖండించారు. నెట్టింట వస్తున్న వార్తలన్నీ తప్పుడు కథనాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఢిల్లీ ప్రిమియర్‌ లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపైనే దృష్టిసారించినట్లు తెలిపారు. దివంగత బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ తనయుడే ఈ రోహన్. తండ్రి లాగే రోహన్‌ కూడా న్యాయవాది. నాలుగేళ్ల కింద డీడీసీఏ అధ్యక్షుడిగా అతడు ఎన్నికయ్యారు.

టెస్టు జట్టులోకి తిరిగి రావాలని కోరుకుంటున్న: సూర్య కుమార్
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు ఏడాది తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో ఆడనున్నాడు. దీని తర్వాత దులీప్ ట్రోఫీలో కూడా పాల్గొంటాడు. భారత్ తరఫున కేవలం 1 టెస్టు ఆడిన సూర్యకుమార్ మళ్లీ టెస్టు జట్టులోకి రావాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి తాజాగా కోయంబత్తూరులో సోమవారం జరిగిన బుచ్చిబాబు టోర్నీ ప్రాక్టీస్ సెషన్ తర్వాత సూర్యకుమార్ మాట్లాడుతూ.. చాలా మంది టెస్టులలో తమ స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఇక నేను కూడా మళ్లీ ఆ స్థానాన్ని పొందాలనుకుంటున్నాను. అయితే, భారత్‌కు టెస్టు జట్టులో ఎంపిక చేయడం తన చేతుల్లో లేదని సూర్యకుమార్ తెలిపాడు. జట్టులోకి పునరాగమనం చేయడం నా నియంత్రణలో లేదు. ప్రస్తుతం నేను చేయగలిగింది బుచ్చిబాబు టోర్నీ ఆడడం, ఆ తర్వాత దులీప్‌లో పాల్గొనడం, ఆపై ఏమి జరుగుతుందో చూడడం. ఇక నేను ఎర్ర బంతితో మళ్లీ ఆడటానికి సంతోషిస్తున్నాను అని తెలిపాడు. సూర్యకుమార్ నిజానికి టి20 క్రికెట్‌లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పరిగణించబడతాడు. మరోవైపు, అతను తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో కూడా అద్భుతాలు చేశాడు. ముంబై తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సూర్యకుమార్ 82 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 43.62 సగటుతో 5,628 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్‌ లో అతని అత్యధిక స్కోరు 200 పరుగులు. సూర్యకుమార్ గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌ లో, అతను 1 ఇన్నింగ్స్‌లో 20 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 1 ఫోర్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతనికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత గాయం కారణంగా మొత్తం సిరీస్‌ కు దూరమయ్యాడు.

కమిటీ కుర్రోళ్ళు కాదు కలెక్షన్స్ కుర్రోళ్ళు..
డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది. ఇప్ప‌టికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలోకి పయనిస్తోంది. కంటెంట్ ఉన్నోడికి క‌టౌట్ చాల‌నే డైలాగ్ త‌ర‌హాలో మంచి క‌థ‌తో చేసిన సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో నిహారిక అండ్ టీమ్ క‌మిటీ కుర్రోళ్ళు సినిమాను ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. రోజు రోజుకీ ఆద‌ర‌ణ‌తో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ను కూడా పెంచుకోవ‌టంలో క‌మిటీ కుర్రోళ్ళు స‌క్సెస్ అయ్యారు. సినిమా విజ‌య‌వంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టేసింది. రెండో వారం కంటే మూడో వారంలో సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం. ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 17.76 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకుంటోందీ చిత్రం. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ దక్కించుకుంది.

నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న శనివారం ‘రన్ టైమ్’.
నేచురల్ స్టార్ నాని హీరోగా ‘సరిపోదా శనివారం’ రూపొందింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చుస్తే అర్ధం అవుతుంది.నానికి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఈ ఆగస్టు 29న ‘సరిపోదా శనివారం’ విడుదల కానుంది. ‘దసరా’, హాయ్ నాన్న వంటి హిట్స్ తర్వాత సరిపోదా శనివారం’ తో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు నాని. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కంప్లిట్ చేసుకుంది. 2 గంటల 46 నిమిషాల రన్ టైమ్ తోఫైనల్ కాపీ రెడీ చేసారు. సెన్సార్ టీమ్ యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ రన్ టైమ్ నాని ఫ్యాన్స్ ను భయపెడుతోంది. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే.. సుందరానికి 3 గంటల రన్ టైమ్ తో వచ్చి నిరాశపరించింది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఇంత రన్ టైమ్ అంటే కాస్త భయపడాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ ఎక్కువ హైలెట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరో పాత్ర ఎక్కువగా సైలెంట్ గా ఉండిపోవాల్సి వస్తుందట. దీంతో ఎస్.జె.సూర్య చెలరేగిపోయాడు అని.. అతని విలనిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. అదేనా జరిగితే నాని ఫ్యాన్స్ నిరుత్సాహ పడక తప్పదు.