Today (20-12-22) Business Headlines:
‘ఏపీ బ్యాంక్’కి జరిమానా: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంకు.. రూల్స్ పాటించకపోవటంతో ఆర్బీఐ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. మరో 19 కోపరేటివ్ బ్యాంకుల పట్ల కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇందులో 17 బ్యాంకులు ఒక్క గుజరాత్కే చెందినవి కావటం గమనించాల్సిన విషయం. బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ అండ్ కువైట్ బీఎస్సీ మీద సైతం ఆర్బీఐ కన్నెర్ర చేసింది. నాన్-కంప్లయెన్స్ గైడ్లైన్స్ ఫాలో కానందున రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ఫైన్ వేసింది.
స్టార్టప్ ఖేతి ఐదేళ్ల ప్రణాళిక
హైదరాబాద్కు చెందిన ఖేతి అనే స్టార్టప్.. వచ్చే ఐదేళ్లలో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. చిన్న రైతులకు గ్రీన్ హౌజ్లను నిర్మించి ఇచ్చే ఈ అగ్రిటెక్ సంస్థకు ఇటీవలే అరుదైన గుర్తింపు లభించింది. ప్రిన్స్ విలియం అండ్ ది ఎర్త్ షాట్ ప్రైజ్ పొందింది. ఈ బహుమతి కింద 10 కోట్ల రూపాయల నగదు సొంతం చేసుకుంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలతోపాటు మరో 5 రాష్ట్రాల్లో వెయ్యి మంది రైతులు ఈ కంపెనీ సర్వీసులను పొందుతున్నారు. 2027 నాటికి మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని, వినియోగదారుల సంఖ్యను.. అంటే.. రైతుల సంఖ్యను 50 వేలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డెక్కన్ క్రానికల్కి సెబీ నోటీస్
హైదరాబాద్లోని డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రమోటర్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రికవరీ నోటీసులను జారీ చేసింది. 2008-12 మధ్య కాలంలో ఫేక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు చూపినందుకు 4 కోట్ల 29 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బును 15 రోజుల్లోగా ఇవ్వకపోతే నిందితుల ఆస్తులమ్మి వసూలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. బ్యాంక్ అకౌంట్లను అటాచ్మెంట్ చేసుకుంటామని, సంబంధిత వ్యక్తులు అరెస్టు మరియ జైలు శిక్ష సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది.
ప్యాసింజర్లు కోటీ 16 లక్షలు
గతేడాది నవంబర్తో పోల్చితే ఈ సంవత్సరం నవంబర్లో దేశీయంగా విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్య 11 శాతానికి పైగా పెరిగింది. పోయినేడాది నవంబర్లో కోటీ ఐదు వేల మంది మాత్రమే జర్నీ చేయగా ఈసారి కోటీ 16 లక్షల మంది ప్రయాణించారు. అక్టోబర్ కన్నా నవంబర్లో రెండు లక్షల మంది ఎక్కువ జర్నీ చేశారు. ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. సగం కన్నా ఎక్కువ మార్కెట్ షేర్ను ఇండిగో ఎయిర్లైన్స్ సొంతం చేసుకోవటం విశేషం. ఇన్టైమ్లో విమానాలను నడపటంలో కూడా ఈ సంస్థే 92 శాతం యావరేజ్తో నంబర్ వన్ ర్యాంక్ పొందింది.
పేటీఎం నుంచి కొత్త సర్వీసు
యూపీఐ ట్రాన్సాక్షన్లకు కూడా ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్తో ఒప్పందం చేసుకున్నామని పేర్కొంది. సంవత్సరానికి 30 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే.. మోసపూరిత లావాదేవీకి 10 వేల రూపాయల వరకు బీమా పొందొచ్చని వెల్లడించింది. పేటీఎం యాప్లో పేమెంట్ ప్రొటెక్ట్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకొని కస్టమర్ పేరు, మొబైల్ నంబర్ యాడ్ చేసి ప్రీమియం కట్టాలని సూచించింది. సైబర్ నేరాల కారణంగా కస్టమర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ బీమా పాలసీకి రూపకల్పన చేసినట్లు వివరించింది.
క్యాష్.. రూ.32 లక్షల కోట్లు
పెద్ద నోట్లు రద్దయిన తర్వాత ఈ ఆరేళ్లలో చలామణిలో ఉన్న క్యాష్ ఏకంగా 90 శాతం పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో వెల్లడించారు. 2016-22 మధ్య కాలంలో నోట్ల వాడకం 45 శాతం వృద్ధి చెందినట్లు తెలిపారు. 2016లో 16 లక్షల 41 వేల 571 కోట్ల రూపాయల విలువైన 90 వేల 266 మిలియన్ల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ సంవత్సరం మార్చి నాటికి దాదాపు రెట్టింపు సంఖ్యలో.. 31 లక్షల 5 వేల 721 కోట్ల రూపాయల విలువైన లక్షా 30 వేల 533 మిలియన్ల నోట్లు వాడకంలో ఉన్నాయని వివరించారు.