NTV Telugu Site icon

Tirumala: అక్టోబర్‌ 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirumala

Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్‌ 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జరిగిన తొలి సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ఇంజినీరింగ్‌ పనులు, వాహనాల ఫిట్‌నెస్‌, లడ్డూ బఫర్ స్టాక్‌, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళాబృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్పోర్ట్, కళ్యాణ కట్ట, గోశాల,శ్రీవారి సేవకులు, టీటీడీ విజిలెన్స్‌ విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Read Also: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్.. లక్ష్యసేన్‌ సాధించేనా?

ఈ ఏటాది వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ చూస్తే.. ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల వేళ పలు రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా , అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది.