పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం గంగంపాలెం కొండ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గండి పోశమ్మ ఆలయానికి వెళ్లే మార్గానికి సమీపంలో పులి కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో స్థానికులు, పర్యాటకులు, భక్తుల్లో ఆందోళన నెలకొంది. పులి సంచారంపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా గండి పోశమ్మ క్షేత్రానికి వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి ప్రాంతాల్లో ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పులి సంచారంతో మన్య ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్థానికులు, పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
