Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!

  • పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం
  • లింగవరం పరిసరాల్లో పులి కదలికలు
  • జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ
Polavaram-Tiger

Polavaram-Tiger

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం లింగవరం పరిసరాల్లో పులి కదలికలు గుర్తించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి తర్వాత నాగాలపల్లి ప్రాంతానికి చేరిన పులి.. ఉదయం నుంచి అదే పరిసరాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నారు. గానుగులగొందు ముంపు గ్రామంలో ఓ ఆవుపై పులి దాడి చేసిన ఘటన మరింత ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై రేడియో టెలిమెట్రీ పరికరాల ద్వారా పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. నాగాలపల్లి ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో పులి పాదముద్రలు కూడా గుర్తించారు.

అటవీ శాఖ అంచనా ప్రకారం.. ఈ రాత్రి పులి చిన్నారిగండి, శరభవరం, గండికోట ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చీకటి పడేలోగా ఇళ్లకు చేరుకోవాలని గ్రామస్తులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తోటలకు వెళ్లే రైతులు, బయట పనులు చేసే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే.. గండిపోశమ్మ ఆలయానికి వెళ్లే భక్తుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. పులి సంచారం నేపథ్యంలో ఆలయానికి వెళ్లే వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తం పరిస్థితిని అటవీ శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నారు.