టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో పలువురు సినీ తారలపై నమోదు చేసిన ఆరు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది.ఎక్సైజ్ శాఖ సరైన ప్రోసిజర్స్ పాటించలేదని అభిప్రాయపడింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులు కొట్టివేసినట్లు పేర్కొంది. సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును కొట్టివేసినట్లు నాంపల్లి కోర్ట్ ప్రకటించింది.. కాగా 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. పూరీ జగన్నాథ్, చార్మీ, తరుణ్, నవదీప్, రవితేజ, శ్యామ్ కె నాయుడు, ముమైత్ ఖాన్, తనీష్ సహా పలువురిపై డ్రగ్స్ కేసు నమోదు చేసింది.ఈ డ్రగ్స్ కేసుపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది.
డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నవారిని నెలల తరబడి వారిని విచారించినా కూడ ఎలాంటి ఫలితం లేకపోయింది. వారి నుంచి వెంట్రుకలు మరియు గోళ్లను శాంపిల్ గా తీసుకున్నారు. కానీ కేవలం దర్శకుడు పూరీ జగన్నాథ్ మరియు హీరో తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడ ఈ ఇద్దరి శరీరంలో ఎటువంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలింది.పైగా డ్రగ్స్ కేసులో పాటించాల్సిన విధివిధానాలు అధికారులు సరిగా ఫాలో అవకపోవడంతో కోర్టులో ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆరు కేసుల్లో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని న్యాయస్థానం గుర్తించింది. పూరీ జగన్నాథ్, తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభ్యం కాలేదంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం ఎనిమిది కేసుల్లో ఆరింటిని కొట్టివేసింది.