అతి వేగం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ఓ కారు ముందు నిలిపి ఉన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి 11 గంటలకు ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిది మంది వ్యక్తులతో వెళ్తున్న కారు అతివేగంగా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న డంపర్ను వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. కారులో వ్యక్తులంతా అందులోనే ఇరుకుపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
READ MORE: Pakistan: భారత్ అభివృద్ధిపై పాక్ చట్టసభల్లో ఆసక్తికర చర్చ.. ఏమన్నారంటే..?
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోని వ్యక్తులను బయటకు తీసేందుకు యత్నించారు. వేగంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయని.. మరో వ్యక్తి గాయపడ్డారని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఇసుక చెల్లాచెదురుగా పడిపోయింది. మృతులు భాగ్తండా నుంచి గుణకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ఒకరు పోలీస్ అని.. అతని వద్ద ఐడీకార్డు లభించినట్లు వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. రాత్రి సమయం కావడంతో ముందు నిలిపి ఉన్న వాహనం సరిగ్గా కనిపించలేదు. రాత్రి సమయం కావడంతో డ్రైవర్ నిద్రలోకి జారుకునే అవకాశం కూడా ఉండొచ్చని అంచనా.