NTV Telugu Site icon

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘునాథరావు ప‌ద‌వీ విర‌మణ.. ఘనంగా వీడ్కోలు

Tgsrtc

Tgsrtc

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-ఆపరేషన్స్ టి.రఘునాథరావు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ – ఆపరేషన్స్ పి.జీవన్ ప్రసాద్‌తో పాటు మరో ఏడుగురు రిటైర్డ్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీకి ఎన్నో ఏళ్ల పాటు సేవ‌లందించిన వారిని టీజీఎస్ఆర్టీసీ ఘ‌నంగా స‌న్మానించి వీడ్కోలు ప‌లికింది. హైద‌రాబాద్‌లోని బస్ భవన్‌లో శుక్రవారం వీడ్కోలు కార్యక్రమాన్ని సంస్థ నిర్వహించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ స‌జ్జనార్‌ హాజరయ్యారు. పదవీ విరమణ పొందిన వారందరినీ శాలువా క‌ప్పి ఆయన ఘనంగా స‌న్మానించారు. నిజాయ‌తీ గ‌ల అధికారులు, సిబ్బందిగా సంస్థలో పేరు గడించిన వారి సేవలను కొనియాడారు.

Read Also: High Temperatures: మండుతున్న ఎండలు.. తెలంగాణలో 47 డిగ్రీలకు పైనే..

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. రఘునాథరావు 1990 నుంచి 34 ఏళ్ల పాటు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలో వివిధ హోదాల్లో ప‌నిచేశార‌ని గుర్తుచేశారు. చీఫ్ మెకానికల్ఇంజనీర్‌గా దాదాపు 2 వేల కొత్త బస్సులను రోడ్డు మీదకు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. మెకానికల్ ఇంజనీర్ విభాగంలో అపారమైన అనుభవం ఆయనకు ఉందని, సంస్థ క్లిష్ట ప‌రిస్థితుల్లో చాలా కూల్‌గా ప‌నిచేసి.. మంచి ఫ‌లితాల‌ను తీసుకువ‌చ్చార‌ని చెప్పారు. 16 పర్యాయాలు మేడారం జాతరలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు.

సీటీఎం జీవన్ ప్రసాద్ ఆపరేషన్స్ విభాగంలో సమర్థవంతంగా పనిచేశారని మొచ్చుకున్నారు. ప్రజల వద్దకు ఆర్టీసీ, విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థ, ఛాలెంజ్ లను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర ఉందని వివరించారు. అధికారులు, సిబ్బంది నిబద్దత, అకింతభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి తనకెంతో గర్వంగా ఉందన్నారు. పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బంది విశ్రాంత జీవితం ఆయురారోగ్యాల‌తో గ‌డ‌పాల‌ని ఆకాంక్షించారు.

అలాగే పదవీ విరమణ పొందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-కమర్షియల్ పి.నగేష్, బీఆర్సీ మూర్తి (అకౌంట్స్ ఆఫీసర్), రవిందర్ రావు (ఏఎంఎఫ్), హరికిషన్ (సూపరింటెండెంట్), హఫీజ్ (సీనియర్ అసిస్టెంట్), కృష్ణ (రోటిన్ క్లర్క్), బాలిరెడ్డి (రికార్డు ట్రేసర్) లను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీవోవో డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ప, హెచ్వోడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.