తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. నిరుద్యోగులు తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వివరాలను సరిచూసుకోవడానికి… అవసరమైన మార్పులు చేసుకోవడానికి కమిషన్ చివరి అవకాశాన్ని కల్పించింది. అభ్యర్థుల డేటాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడటం ద్వారా భవిష్యత్తులో నోటిఫికేషన్ల జారీ , ఫలితాల వెల్లడి ప్రక్రియను మరింత వేగవంతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
గతంలో ఈ OTR అప్డేట్ చేయడానికి మార్చి 25ను ఆఖరి తేదీగా నిర్ణయించినప్పటికీ, అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గడువును ఏప్రిల్ 10వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇదే ఆఖరి గడువు అని, దీని తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని పెంచబోమని కమిషన్ స్పష్టం చేసింది. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులందరూ తమ వివరాలను ఎడిట్ చేసి, విద్యార్హతలు.. ఇతర ముఖ్యమైన ధృవపత్రాలను (Certificates) వెబ్సైట్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని అభ్యర్థులు రాబోయే కొత్త నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా మిగిలిపోతారు.
Also Read:Iran Attack On USS Abraham Lincoln: అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. వార్నింగ్ ఇచ్చిన గంటకే ఇలా..
తొలిసారిగా రిజిస్ట్రేషన్ చేసుకునే కొత్త అభ్యర్థులకు ఈ గడువుతో సంబంధం లేదు. వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ.. పాత అభ్యర్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే దానిని డేటా ట్యాంపరింగ్గా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులు తమ వివరాలను అప్డేట్ చేసేటప్పుడు ముఖ్యంగా స్థానికత (Local Status), కులం , విద్యార్హతల విషయంలో ఇంటర్నెట్ సెంటర్లపైనే పూర్తిగా ఆధారపడకుండా స్వయంగా సరిచూసుకోవడం ఉత్తమం. తప్పులు ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని కమిషన్ హెచ్చరించింది. అభ్యర్థులు వెంటనే www.tgpsc.gov.in వెబ్సైట్ను సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కమిషన్ సెక్రటరీ సూచించారు.