Tesla Coming To India: భారత్కు టెస్లా వస్తుందా? పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందా? కేంద్రం ఏమంటోంది? ఏ మేరకు అది కార్యరూపం దాల్చుతుంది? భారత్కు ఎందుకు రావాలనుకుంటుంది? భారత్లో టెస్లాకు ఎదురవుతున్న సవాళ్లు ? టెస్లా రాకపై ఇలా అనేక ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్తో భేటీ అయిన సందర్భంలో మరోసారి టెస్లా రాకపై డిస్కషన్ జరుగుతోంది. మోడీతో భేటీ తర్వాత ఎలాన్ మస్క్ ఇంట్రస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. టెస్లా కార్యకలాపాలు ఇండియా ప్రారంభమవుతాయని మస్క్ ప్రకటించారు. త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తామని అన్నారు. మోడీ అంటే తనకు చాలా ఇష్టమని, మోడీకి పెద్ద అభిమానినని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ప్రపంచంలోని ఏ పెద్ద దేశానికీ లేనంత కేపబిలిటీస్ ఇండియాకు మెండుగా ఉన్నాయని ఎలాన్ మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇండియాలో టెస్లా కార్య కాలాపాలపై మస్క్ మాట్లాడారు. త్వరలోనే టెస్లా భారత్ వస్తుందన్నారు. సరైన సమయంలో వస్తామని అన్నారు. అయితే ఏమేరకు అది కార్యరూపం దాలుస్తుందో ప్రశ్నార్థకం. ఎందుకంటే? 2019 నుంచి టెస్లా మోటార్స్ ఇండియాలో ఈవీ మార్కెట్పై పెట్టింది. కానీ, కార్లపై భారత్ విధించే దిగుమతి పన్ను టెస్లాకు అడ్డంకిగా మారింది. భారత ఆదాయపు పన్ను లెక్కల ప్రకారం.. భారత్లోని ఆటోమొబైల్ సంస్థలు ఇతర దేశాల నుంచి కార్లను భారత్కు దిగుమతి చేసుకునే కార్ల ధర 40వేల డాలర్ల లోపు ఉంటే 60 శాతం, 40వేల డాలర్లు దాటితే 100 శాతం దిగుమతి సుంకం చెల్లించాలి. కానీ, టెస్లా తయారీ చేసే అంత్యంత చవకైన కారు ధర 45వేల డాలర్లు. అంటే సుమారు రూ.37లక్షలు. అంటే ఈ లెక్కన 100 శాతం టాక్స్ కట్టాలి. ఇక్కడే టెస్లా వెనుకడుగు వేసింది. దిగుమతి సుంకంతో టెస్లా కార్ల ధరలు పెరుగుతాయి. ఆటోమేటిగ్గా సేల్స్ పడిపోతాయి. ప్రపంచంలోని ఏ అతి పెద్ద దేశంలో లేని విధంగా భారత్లో మాత్రమే ఇంపోర్ట్ ట్యాక్స్ ఉందని టెస్లా కంపెనీ పెదవి విరిచింది.
వాస్తవానికి టెస్లా రాకను కేంద్రం వ్యతిరేకిస్తోంది. కారణం మోడీ మేకిన్ ఇన్ ఇండియా నినాదం. భారత్కు రండి.. పరిశ్రమల్ని స్థాపించండి.. తద్వారా తయారీ ఖర్చు తగ్గించుకుని.. లాభాల్ని గడించండి అంటూ ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. టెస్లాతో కూడా కేంద్రం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఇక్కడ కార్లను తయారు చేసి రాయితీలు పొందవచ్చు. అలా కాకుండా చైనాలో తయారు చేసి భారత్లో అమ్ముతామంటే కుదరదని గతంలోనే చెప్పింది. అయితే, టెస్లా వాదన భిన్నంగా ఉంది. ఏ దేశంలో నైనా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలంటే ముందుగా.. ఆ దేశంలో తమ కార్లను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలి. సేల్స్ జరిగిన తర్వాతే కార్ల తయారీ యూనిట్ను ప్రారంభిస్తామంటున్నారు. అందుకు ఒప్పుకోని ఏ దేశంలోనూ తమ కార్లను తయారు చేసేందుకు ఒప్పుకోమని మస్క్ స్పష్టం చేశారు. దిగుమతి సుంకం తగ్గింపుపై టెస్లా పట్టుబట్టడం, మేక్ ఇన్ ఇండియా కోసం కేంద్రం ఒత్తిడి చేయడంతో భారత్లో అడుగు పెట్టడాన్ని టెస్లా సైతం వ్యతిరేకించింది.
మొత్తానికి ఎవరి వాదన ఎలా వున్నా ఈ యేడాది చివరి నాటికి టెస్లా ఇండియా రాబోతోందనేది గుడ్ న్యూస్. యూనిట్ ఏర్పాటు కోసం స్థలం త్వరలో ఎంపికవుతుంది. టెస్లా బృందం ఢిల్లీకి రావడం, ఇక్కడ పీఎంవో అధికారులతో మాట్లాడడం చకచకా జరిగాయి. భారత ప్రభుత్వం టెస్లాతో కలిసి పనిచేసుందుకు సుముఖంగా ఉందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా అన్నారు. 2030 నుండి ఏటా 20 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఎలాన్ మస్క్ భారత్లో టెస్లా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అంతకంటే ముందే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఫోక్స్ వ్యాగన్ వంటి సంస్థలు భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో ముందంజలో ఉన్నాయి. కాబట్టే ఎంత వీలైతే అంత త్వరగా భారత్లో టెస్లా అడుగు పెట్టే దిశగా మస్క్ ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.
టెస్లా ప్రస్తుతం 6 ప్లాంట్లలో కార్లను తయారు చేస్తుంది. వాటిలో 4 అమెరికాలో ఉన్నాయి. షాంఘై, బెర్లిన్లో రెండు గిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో కార్లలో ఉపయోగించే బ్యాటరీలతో పాటు, కార్లను తయారు చేసే సామర్ధ్యం ఉంది. మరో గిగా ఫ్యాక్టరీని మెక్సికోలో స్థాపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు మస్క్. ఎయిరో డైనమిక్స్, మినిమలిస్ట్ డిజైన్స్, ఆటోపైలట్ వంటి హై-ఎండ్ ఫీచర్లు టెస్లా కార్లలో ప్రత్యేకం. దీంతో పాటు భారత ప్రభుత్వం క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుండడంతో ఎలక్ట్రిక్ వాహనాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సెక్టార్లో ప్రస్తుతం టాటా మోటార్స్ హవా నడుస్తోంది. ఈవీ ఎలక్ట్రిక్ కార్లను రూ.20లక్షల కంటే తక్కువ ధరకు అమ్ముతోంది. అయితే టెస్లా అలా కాదు. కార్ల కాస్ట్ చాలా ఎక్కువ. మరి టెస్లా ఈ సవాళ్లను ఎఓలా ఎదుర్కొంటుంది? పోటీని తట్టుకోడానికి ధరల తగ్గించి అమ్ముతుందా? టెస్లా అందుకు రెడీగా ఉందా? అనేది మాత్రం వేచిచూడాల్సిన అంశమే.