Telangana to Launch Tourist Police Units: తెలంగాణలో పర్యాటక పోలీసులు త్వరలో రాబోతున్నారు. రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయిస్తామని డీజీపీ వెల్లడించారు. వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూనే, భద్రతకు ప్రాధాన్యం ఇస్తాం అని డీజీపీ జితేందర్ చెప్పుకొచ్చారు.
ఈరోజు డీజీపీ కార్యాలయంలో పర్యాటకశాఖ, పోలీస్ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టూరిజం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్, టూరిజం ఎండీ వి.క్రాంతి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ చ.ప్రియాంకతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయిస్తాం’ అని చెప్పారు.
Also Read: Khazana Jewellery Robbery: కేసును ఛాలెంజ్గా తీసుకున్నాం.. త్వరలోనే ఛేదిస్తాం: డీసీపీ
‘వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదాద్రి, పొచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఈ యూనిట్లు పనిచేయనున్నాయి. షూటింగ్ పర్మిట్లు, ప్రత్యేక ఈవెంట్ల నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. భద్రతా ఏర్పాట్ల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూనే, భద్రతకు ప్రాధాన్యం ఇస్తాం’ అని డీజీపీ జితేందర్ తెలిపారు.
