తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్ అందింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు పచ్చజెండా లభించింది. టీ-ఫైబర్ ప్రాజెక్ట్పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమెండేడ్ భారత్నెట్ కార్యక్రమం (ABP) కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడంపై మండలం నుంచి గ్రామ పంచాయతీ రింగ్ నెట్వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడంపై కూడా కేంద్ర మంత్రి సింధియాతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని సింధియా హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి బలమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే ఆలోచనపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ వెన్నెముక వైపు నిర్ణయాత్మకంగా ముందుకు సాగుతోంది. టీ-ఫైబర్ నెట్వర్క్ ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా అనుసంధానించనుంది. మొదటి దశలో దెబ్బతిన్న నెట్వర్క్ ఉన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేయనున్నారు.
