Telangana Vehicle Price Hike: కొత్తగా వాహనం తీసుకునే వాళ్లకు బిగ్ షాక్ వచ్చేసింది. తెలంగాణలో వాహనాల ధరలు పెరగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుంచి రూ.10,000 చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. కొత్తగా వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసినప్పుడు వాహనదారులు చెల్లించే లైఫ్ ట్యాక్స్ను గతేడాది ఆగస్టులో రవాణాశాఖ పెంచింది. ఖరీదైన వాహనాలపై ఒకటి నుంచి ఆరు శాతం వరకు పెంచింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై కొంతకాలం తర్వాత తెలంగాణకు మార్చుకునే పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా వాటి విలువను బట్టి 1-6 శాతం వరకు పెంచింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ 53, 54 జీఓలను గతేడాది ఆగస్టు 13న జారీ చేశారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం ద్విచక్ర వాహనాల శ్లాబులు రెండు నుంచి నాలుగుకు… కార్లు, జీపుల శ్లాబులు నాలుగు నుంచి ఐదుకు పెరిగాయి. ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు సైతం భారీగా పెరిగాయి. తాజాగా మరోసారి భద్రత పన్ను పేరిట వసూళ్లు చేపట్టడంతో సామాన్య ప్రజలపై భారం పడనుంది.
READ MORE:Nani : ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్.. ఒకరు కాదు ముగ్గురు సంగీత దర్శకులు?
