PSCMS : తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యానికి, అధిక ఫీజుల దోపిడీకి చెక్ పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ బిగ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రైవేట్ స్కూళ్లపై వచ్చే ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ‘ఆన్లైన్ ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్’ (PSCMS) పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై పాఠశాలల అక్రమాలపై తల్లిదండ్రులు, విద్యార్థులు లేదా సాధారణ ప్రజలు ఎవరైనా ఇంట్లో కూర్చునే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో విద్యాశాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
సులభంగా ఫిర్యాదు నమోదు.. ఓటీపీతో లాగిన్
పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లోని ‘Online Services’ విభాగం ద్వారా PSCMS సేవలను పొందవచ్చు. ఫిర్యాదు నమోదు చేయాలనుకునే వారు తమ మొబైల్ నంబర్తో లాగిన్ కాగా, ఆ నంబర్కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి. అనంతరం పాఠశాల పేరు, ఫిర్యాదు రకం, సమస్య పూర్తి వివరాలను తెలిపి, ఆధారాలకు సంబంధించిన పత్రాలు లేదా ఫోటోలను నేరుగా అప్లోడ్ చేసే సదుపాయం కల్పించారు. సమస్య తీవ్రతను బట్టి సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు.
స్టేటస్ ట్రాకింగ్ సదుపాయం.. జవాబుదారీతనం
తాము ఇచ్చిన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ‘Grievance Tracking Mechanism’ను కూడా ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు తమ ఫోన్ నంబర్ లేదా కేటాయించిన ‘Grievance ID’ ద్వారా ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. ఇందులో ఫిర్యాదు ఐడీ, పేరు, ఫోన్ నంబర్, యూజర్ రకం, అప్లోడ్ చేసిన పత్రాలు , ఆన్-గ్రౌండ్ అధికారి తీసుకున్న చర్యల ప్రస్తుత స్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రైవేట్ స్కూళ్ల వేధింపులపై నిజమైన సమస్యలు ఉన్న తల్లిదండ్రులు పూర్తి, కచ్చితమైన వివరాలతో ఈ ఆన్లైన్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ కోరింది.

