Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..

Pm Kisan

Pm Kisan

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. జొన్న పంట కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రూ. 994 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధాన్యం, పంటల కొనుగోలు విధానం వేగవంతంగా, పారదర్శకంగా సాగుతోందని, ఇది మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు రూపొందించిన ‘తెలంగాణ ఎరువుల యాప్’ విజయవంతం కావడంతో, దాని ప్రమాణాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ‘ఫెర్టిలైజర్ ఫీల్డ్ స్టాఫ్’ (FFS) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నూతన ఎరువుల పంపిణీ విధానాన్ని నేటి నుంచి మరో 10 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలు, అవగాహన అందించాలని ఆదేశించారు. తెలంగాణను ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.

ఇదే సమావేశంలో చేనేత రంగానికి సరికొత్త సాంకేతికతను జోడించేలా నిర్వహించిన హ్యాండ్లూమ్ హ్యాకథాన్ లో విజేతగా నిలిచిన ప్రతిభావంతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించి, ఘనంగా సన్మానించారు. చేనేత కార్మికుల నైపుణ్యానికి సాంకేతికత తోడైతే మార్కెటింగ్ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమం, వ్యవసాయ రంగం బలోపేతమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.