CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరు చేశాం..

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy: విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల కేంద్రం ప్రకటించిన పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరిందని సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తున్నామని, ఇప్పటి వరకు 105 పాఠశాలలకు మంజూరు ఇచ్చామని చెప్పారు. గోల్కొండ వేదికగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు, తెలంగాణ పబ్లిక్ పాఠశాలలను ప్రారంభించామని, డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 212 శాతం పెంచామని వివరించారు. 22 లక్షల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందిస్తూ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నామని తెలిపారు. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.

సామాజిక భద్రతలో భాగంగా సన్నబియ్యం పంపిణీ ఓ విప్లవాత్మక పథకమని, 93 లక్షలకు పైగా రేషన్ కార్డులు, 3.38 కోట్ల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నామని, రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచుతున్నామని వివరించారు. పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, మొదటి దశలో 4.50 లక్షల ఇండ్లకు ఆమోదం తెలిపి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయం అందిస్తున్నామని, రెండో విడతలో 2.50 లక్షల కొత్త ఇండ్లకు మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాద్ నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు తదితర 43 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నామని, డిసెంబర్ 2023 నుంచి జులై 2026 వరకు పింఛన్ల కోసం రూ.30,089 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. కొత్తగా 2.25 లక్షల మంది అర్హులకు పింఛన్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు.

సామాజిక న్యాయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దేశంలోనే సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను పకడ్బందీగా నిర్వహించి సామాజిక వర్గీకరణ నివేదికలు రూపొందించామని సీఎం స్పష్టం చేశారు. 59 ఎస్సీ ఉపకులాలను వర్గీకరించి, ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించామని చెప్పారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి 12.4 శాతం కేటాయించామని పేర్కొన్నారు. పదిహేనేళ్ల తరువాత కనీస వేతనాల సవరణను ఆమోదించి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చామని, వేతనాలను రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచామని వివరించారు. గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమలుకు శ్రీకారం చుట్టామని, వయోవృద్ధుల సంరక్షణలో ఉద్యోగుల బాధ్యతను నిర్దేశిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు.