తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే చారిత్రాత్మకమైన రూ. 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ భారీ రుణమాఫీతో దేశంలోనే రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఒకేసారి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని, ఆ ఘనత కేవలం మన ప్రభుత్వానికే దక్కుతుందని తుమ్మల పేర్కొన్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 20,616 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలు రుణ విముక్తి పొందాయని ఆయన వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల సకాలంలో రుణమాఫీ జరగక, సామాన్య రైతుపై వడ్డీ భారం పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయారని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, రైతు ప్రయోజనాల కోసం కాదని ఆయన మండిపడ్డారు.
Also Read:Egypt: ఈజిప్ట్ సమాధిలో అద్భుత ఆవిష్కరణ.. 3,000 ఏళ్ల నాటివి కూడా చెక్కు చెదరకుండా..
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు విముక్తి కల్పించామని తుమ్మల తెలిపారు. కేవలం రుణమాఫీతోనే ఆగిపోకుండా, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి .. నాణ్యమైన విత్తనాల సరఫరా వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్నదాతల ఆదాయం పెంచేలా మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ స్పష్టమైన చర్యల వల్ల తెలంగాణ రైతాంగం మళ్ళీ ఆత్మవిశ్వాసంతో సాగు వైపు అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.
