Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్ రాబోతున్నారా.? ప్రస్తుతం ఉన్న మీనాక్షి నటరాజును అధిష్టానం తప్పిస్తుందా.? ఇప్పటికప్పుడు నిర్ణయాలు ఉంటాయా.? ఉంటే కొత్త ఇంచార్జ్ ఎవరు.? తెలంగాణకు వచ్చే వారెవరు.? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ కొనసాగుతున్నారు. అయితే చాలా రోజులుగా మీనాక్షి నటరాజన్ విదేశాల్లో విద్యను అభ్యసించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె 10 నెలల పాటు విదేశాల్లో చదువుకున్నారు. అప్పట్లో రాహుల్ గాంధీ నో చెప్పారు. కానీ ఉన్నత చదువుల కోసం వచ్చిన అవకాశం వదులుకోవడం ఎందుకు అనే ఆలోచనతో పార్టీ నాయకత్వానికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు హై కమాండ్ అంగీకారం తెలిపింది.
అయితే త్వరలోనే విదేశాల్లో చదువుకోవడం కోసం మళ్లీ వెళ్ళబోతున్నారు మీనాక్షి నటరాజన్. అయితే మరో రెండు నెలల పాటు ఇంచార్జ్ గా మీనాక్షినే కొనసాగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంచార్జ్ మీనాక్షి ప్లేస్ లో కొత్తవారు రావడం అనేది పక్కగా కనిపిస్తుంది. అయితే కొత్త ఇంచార్జ్ గా సీనియర్ నియమించే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది. ఇందుకోసం తమిళనాడుకు చెందిన ఇద్దరు ముఖ్యనేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.
వీరిలో ముందు వరసలో ఎంపి సెంధిల్ పేరు ఉంది. రాహుల్ గాంధీ కోటరీలో కీలక నాయకుడిగా సెంధిల్ కి మంచి పేరుంది. తమిళనాడుకు చెందిన మరో సీనియర్ నేత మాజీ ఎంపి చల్లకుమార్ పేరు కూడా ప్రచారంలో ఉన్నట్లు టాక్. సీనియర్ నాయకుడు ముకుల్ వాసనిక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మంది నాయకులకు వాసనిక్ తో కూడా సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంతో అధిష్టానం ఆలోచన ఎలా ఉంటుంది..? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి తమిళనాడుకు చెందిన నాయకులు ఇంచార్జ్ గా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సెంతిల్ కు పార్టీలో మంచి పేరు ఉంది. గాంధీ కుటుంబానికి విధేయుడు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మూడు పేర్లలో ఒకరు తెలంగాణ ఇంచార్జ్ గా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే నియామకం ఎప్పుడు అనేది వేచి చూడాలి.

