Minister KTR: స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన పారిశ్రామిక వేత్తలతో బిజీగా గడిపారు. పలు పరిశ్రమలు తెలంగాణకు వచ్చేలా చేయడంలో ఆయన సఫలమయ్యారు. మంత్రి కేటీఆర్ నాలుగు రోజుల పర్యటనలో రాష్ట్రానికి 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా చర్చలు జరిగినట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్ ఈ 4 రోజుల్లో 52 వ్యాపార సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు నిర్వహించారు.
సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో మరో 2 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించింది. 2 వేల కోట్ల రూపాయలతో ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్ను తెలంగాణలో ఏర్పాటుచేస్తున్నట్లు భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్లో విస్తరిస్తామని ఫ్రాన్స్కు చెందిన ప్రఖ్యాత ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్ ప్రకటించింది. లండన్ తరువాత హైదరాబాద్లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను అపోలో టైర్స్ ప్రారంభించనుంది.
TSRTC: టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం.. 11 రోజుల్లోనే రూ.165.46 కోట్ల రాబడి
210 కోట్ల రూపాయల పెట్టుబడితో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్లు పెప్సికో ప్రకటించింది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించనున్నట్లు ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించింది. రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించే వెబ్ పీటీ, 150 కోట్లతో హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. నాలుగు రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక వేత్తలతో 2 చర్చా గోష్టులు జరగగా.. మొత్తంగా 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రానుండడం గమనార్హం.